Begin typing your search above and press return to search.

మాజీ సీఎస్‌ లు వేలెత్తి చూపిన ఏకైక సర్కార్

By:  Tupaki Desk   |   20 Nov 2018 8:11 AM GMT
మాజీ సీఎస్‌ లు వేలెత్తి చూపిన ఏకైక సర్కార్
X
రాష్ట్రాల్లో అత్యున్న‌త స్థాయి ఉద్యోగం - ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(సీఎస్‌). రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులంతా ఆయ‌న‌కే జ‌వాబుదారీగా ఉంటారు. ఐపీఎస్‌ ల బాస్ డీజీపీ సైతం ఆయ‌న‌కు నివేదిక‌లు స‌మ‌ర్పిస్తుంటారు. ప్ర‌భుత్వం జారీ చేసే ఆదేశాలు - ఉత్త‌ర్వుల అమ‌లు బాధ్య‌త‌ను సీఎస్ చూసుకుంటారు. ముఖ్య‌మంత్రికి పాల‌న‌లో స‌హ‌కారం అందిస్తుంటారు. ఏది త‌ప్పో ఏది ఒప్పో నిక్క‌చ్చిగా చెబుతుంటారు. రాష్ట్రంలో ఏ మూల‌న ఎప్పుడు ఏం జ‌రిగినా సీఎస్‌ కు తెలిసిపోతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో అలాంటి అత్యున్న‌త స్థానాన్ని అలంక‌రించిన ఇద్ద‌రు విశ్రాంత ఐఏఎస్ అధికారులు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాబును అవినీతి కొండ‌గా వారు అభివ‌ర్ణిస్తుండ‌టంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

చంద్ర‌బాబు స‌ర్కారుపై విమ‌ర్శ‌ల క‌త్తి దూస్తున్న ఆ ఇద్ద‌రు మాజీ సీఎస్‌ లు.. ఐవైఆర్‌ కృష్ణారావు - అజేయ కల్లం. ప‌ద‌విలో ఉండ‌గానే వీరు కొన్నిసార్లు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను త‌ప్పుప‌ట్టారు. ప‌ద‌వీ విమ‌ర‌ణ అనంత‌రం వారికి మ‌రింత స్వేచ్ఛ ల‌భించిన‌ట్ల‌యింది. దీంతో త‌మ త‌మ పుస్త‌కాల ద్వారా బాబు ప్ర‌భుత్వంపై తీవ్ర అవినీతి - అక్ర‌మాల‌కు సంబంధించిన ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. దేశ చ‌రిత్ర‌లో ఇలా మాజీ సీఎస్‌ లు ఓ స‌ర్కారుపై వేలెత్తి చూప‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌ధానంగా ఐవైఆర్ కృష్ణారావు విశాఖ కుంభ‌కోణాన్ని ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. రికార్డులను తారుమారు చేసి లక్షల ఎకరాల కబ్జాకు పాల్పడిన విశాఖ భూ కుంభకోణం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీదని ఆయ‌న చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని అంతా అధికారులపైకి నెట్టేసి రాజకీయ నేతలను ప్ర‌భుత్వం త‌ప్పించింద‌ని - సిట్‌ దర్యాప్తు సక్రమంగా లేదని స్పష్టం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం రైతుల నుంచి మూడు పంటలు పండే సారవంతమైన భూములు తీసుకోవడాన్ని కూడా ఐవైఆర్‌ తప్పుప‌ట్టారు. ఇక ప్ర‌భుత్వం విచ్చ‌ల‌విడిగా అంచ‌నాలు పెంచ‌క‌పోయి ఉంటే పోల‌వరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్త‌యి ఉండేద‌ని కూడా ఆయ‌న సూచిస్తున్నారు. త‌న ఆరోప‌ణ‌ల‌న్నింటినీ వివ‌రిస్తూ ‘నవ్యాంధ్రలో నా నడక’ పేరుతో ఓ పుస్తకాన్ని ఐవైఆర్‌ ఈ నెల 25 తేదీన విడుదల చేయనున్నారు.

ఇక అజేయ క‌ల్లాం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్ప‌డుతున్న తీరుపై విమ‌ర్శ‌లు ఎక్కు పెడుతున్నారు. ప్రజా సంక్షేమం కోసం వెచ్చించాల్సిన వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కోసం పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్నారు. పేదలకు పని కల్పించేందుకు వినియోగించాల్సిన ఉపాధి హామీ పథకం నిధులను నీరు–చెట్టు వంటి ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తూ అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నార‌ని ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ఐటీ కంపెనీలకు భూ కేటాయింపుల పేరుతో సాగుతున్న అవినీతిపై కూడా క‌ల్లాం ప్ర‌ధానంగా విరుచుకుప‌డుతున్నారు. విశాఖపట్టణంలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థకు ప్రభుత్వం కారు చౌకగా భూములను విక్రయించిన సంగ‌తిని ప్ర‌స్తావిస్తున్నారు. వాస్త‌వానికి ఐటీ కంపెనీల‌కు భూముల‌ను కేవ‌లం లీజుకివ్వాల‌ని, విక్ర‌యించ‌కూడ‌ద‌ని సూచిస్తున్నారు. అందుకు భిన్నంగా చంద్ర‌బాబు త‌నయుడు - మంత్రి లోకేశ్ జోక్యం చేసుకొని త‌న ఇష్టానుసారం ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థకు కారుచౌక‌గా 40 ఎక‌రాలు క‌ట్ట‌బెట్టేశార‌ని ఆరోపించారు. అమ‌రావ‌తి నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విధానం - సెట్‌ టాప్ బాక్సుల కుంభ‌కోణాల‌ను కూడా ప్ర‌స్తావిస్తూ క‌ల్లా ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు.