Begin typing your search above and press return to search.

పీకే ఇంకో టార్గెట్‌..ఆ వార‌సుడితో ప్ర‌జాయాత్ర‌

By:  Tupaki Desk   |   18 July 2019 3:31 PM GMT
పీకే ఇంకో టార్గెట్‌..ఆ వార‌సుడితో ప్ర‌జాయాత్ర‌
X
వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల‌ను ఎదుర్కోనున్న మ‌రాఠ గడ్డ‌పై రాజ‌కీయాలు మారుతున్నాయి. బీజేపీతో క‌ల‌హాల కాపురం అన్న‌ట్లుగా సాగుతున్న‌ప్ప‌టికీ..రాబోయే ఎన్నిక‌ల‌ను క‌లిసే ఎదుర్కోవాల‌ని భావిస్తున్న శివ‌సేన ఈ క్ర‌మంలో ఇందుకు త‌గిన వ్యూహం స‌న్న‌ద్ధం చేస్తోంది. ఓ వైపు వార‌సుడికి ప‌ట్టాభిషేకం మ‌రోవైపు అధికార పీఠం సుస్థిరం చేసుకోవ‌డం అనే ఎత్తుగ‌డ ల‌క్ష్యంగా ఆ పార్టీ క‌దులుతోంది. ఇందుకోసం రాజ‌కీయ విశ్లేష‌కుడు ప్రశాంత్ కిశోర్‌ ను రంగంలోకి దింపుతోంది. శివసేన చీఫ్‌ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు - పార్టీ యూత్‌ వింగ్‌ నాయకుడు ఆదిత్య ఠాక్రే తాజాగా రాష్ట్రవ్యాప్త ప‌ర్య‌ట‌న చేప‌ట్ట‌డం పీకే ఎత్తుగ‌డ‌లో భాగ‌మ‌ని అంటున్నారు.

ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల‌కు శివ‌సేన వ్యూహాత్మ‌కంగా క‌దులుతోంది. దాదాపు 8 నెల‌ల ముందుగానే రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరొందిన ప్రశాంత్‌ కిశోర్‌ తో శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ముంబైలో స‌మావేశం అయ్యారు. ‘ఎన్‌ డీఏలో భాగంగానే - వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మహారాష్ట్రలో మీతో కలిసి పనిచేయాలని ఉంది’ అంటూ ప్రశాంత్‌ కిశోర్‌ అంతకుముందు ట్విట్టర్‌ లో పేర్కొనగా ఆయన్ను ముంబైలోని శివసేన కార్యాలయం ‘మాతోశ్రీ’కి ఆహ్వానిస్తూ శివసేన యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే బదులిచ్చారు. ఉద్ధవ్ - ప్రశాంత్‌ కిశోర్‌ ల భేటీ ఫొటోలను ఆదిత్య ఠాక్రే ట్విట్టర్‌ లో ఉంచారు. ఈ భేటీ త‌ర్వాత ఆదిత్య ఠాక్రేను సీఎం అభ్య‌ర్థిగా బ‌రిలో నింప‌డంపై చ‌ర్చ జ‌రిగింది. ఈ చ‌ర్చోప‌చ‌ర్చ‌ల ఫ‌లిత‌మే తాజాగా ఆదిత్య పాద‌యాత్ర అని పేర్కొంటున్నారు.

జ‌న ఆశీర్వాద యాత్ర పేరిట ఆదిత్య ఠాక్రే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. పార్టీ నేత‌ల‌తో క‌లిసి పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆదిత్య‌ ప్రత్యేక వాహనం(కారు)లో ఆదిత్య ఠాక్రే బయల్దేరారు. జలగాన్‌ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఈ సంద‌ర్భంగా ఆదిత్య ఉద్వేగ‌భ‌రిత ప్ర‌సంగం చేశారు. ``ఓట్లను అడిగేందుకు నేను ఈ యాత్ర చేపట్టలేదు. మహారాష్ట్రలోని ప్రతీ ఇంటికి శివసేనను చేర్చాలనే సంకల్పంతో నేడు ఈ యాత్ర ప్రారంభించాను. నా దృష్టిలో ఇది ఒక పవిత్ర తీర్థ యాత్ర. సమస్యలను ఎలా పరిష్కరించాలో నా తండ్రి - తాతయ్య నుంచి నేర్చుకున్నాను. నేటి నుంచి దానిని క్షేత్ర స్థాయిలో అమలు చేస్తాను. శివసేన యువకులు - రైతులు - మహిళల పక్షపాతి. ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుంది. వారి సమస్యలకు పరిష్కారం చూపుతుంది.సరికొత్త మహారాష్ట్ర నిర్మాణం మాతోనే సాధ్యం.`` అంటూ ఉద్వేగభ‌రితంగా ప్ర‌సంగించారు.

ఇదిలాఉండ‌గా, ఆదిత్య యాత్ర‌పై అప్పుడే పార్టీ నేత‌లు అంచ‌నాలు పెరిగిపోయాయి. ఇప్ప‌టికే, కాబోయే మహారాష్ట్ర సీఎం ఆదిత్య ఠాక్రే అంటూ సంజయ్‌ రౌత్‌ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిక కొన‌సాగింపుగా తాజాగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `ఆదిత్య ఠాక్రే నాయకత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నా. లోక్‌ సభ ఎన్నికల్లో శివసేనకు ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలియజేసేందుకు - అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయమని ఆదిత్య ప్రజలకు విఙ్ఞప్తి చేస్తారు` అని తెలిపారు. బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్న మరాఠా పార్టీ ఈ దఫా ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతూ ఈ యువ‌నేత‌చే చేయిస్తున్న పాద‌యాత్ర ఆ పార్టీకి ఎలాంటి ఫ‌లితం ఇస్తుందో...వేచి చూడాల్సిందే.