Begin typing your search above and press return to search.

సోమ‌వారం ఏం జ‌ర‌గ‌నుంది...ఢిల్లీలో హాట్ చ‌ర్చ‌

By:  Tupaki Desk   |   18 March 2018 3:47 PM GMT
సోమ‌వారం ఏం జ‌ర‌గ‌నుంది...ఢిల్లీలో హాట్ చ‌ర్చ‌
X
హస్తినలో హోదా పాలిటిక్స్ హీట్‌ పెంచుతున్నాయి.. ఎన్డీయేకు టీడీపీ కటీఫ్‌ చెప్పేయడం, అవిశ్వాసానికి ప్ర‌తిప‌క్ష వైసీపీ, టీడీపీ సిద్ధమవడంతో తాజా పరిణామాల‌న్నీ సోమ‌వారం ఏం జ‌ర‌గ‌నుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది.శుక్రవారమే లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ జరుగుతుందని అంతా భావించారు.. స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ సైతం.. టీడీపీ - వైసీపీలు మోషన్‌ నోటీసులు ఇచ్చినట్టు చదివి వినిపించారు. అయితే అదే సమయంలో రిజర్వేష్ల అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలంటూ టీఆర్ఎస్‌.. కావేరీ అంశంపై అన్నడీఎంకే ఎంపీలు వెల్‌లో నిలబడి నినాదాలు చేశారు. దీంతో సభ ఆర్డర్‌లో లేదంటూ సోమవారానికి సభను వాయిదా వేశారు.. ఆ వెంటనే టీడీపీ - వైసీపీలు మరోసారి అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. మరి ఈ సారైనా సభ ఆర్డర్‌లో ఉంటుందా? సభలో అవిశ్వాసంపై చర్చ జరుగుతుందా?.. జరిగితే ఏ పార్టీ ఇచ్చిన నోటీసుపై చర్చిస్తారు?.. ఆ అవిశ్వాసానికి ఎన్ని పార్టీలు మద్దతు ఇస్తాయా అన్న‌ది అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశం.

అవిశ్వాసం గెల‌వ‌డం, ఓడిపోవ‌డం అనే అంశాన్ని ప‌క్క‌న‌పెడితే...చ‌ర్చ అయితే ఖ‌చ్చితంగా జ‌రుగుతంద‌ని చెప్తున్నారు. టీడీపీ - వైసీపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే కేంద్రాన్ని కడిగి పారేయడానికి సిద్ధమంటూ విపక్ష నేతలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ సహా - ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ అవిశ్వాసానికి మద్దతు తెలిపాయి. సాంకేతికంగా టీడీపీకి 16 మంది, వైసీపీకి 9 మంది ఎంపీలున్నారు. రెండు పార్టీలు అవిశ్వాసానికి సిద్ధమయ్యాయి కాబట్టి ఇక్కడే 25 ఎంఎపీల మద్దతు కనిపిస్తోంది.. ఇక కాంగ్రెస్‌ ప్లీనరీలో ప్రత్యేక హోదాపై తీర్మానం చేసింది.. అవిశ్వాసానికి మద్దతుగా నిలుస్తామని అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్‌కు 48 మంది ఎంపీలు ఉన్నారు.. దీంతో అవిశ్వాసంపై చర్చ జరగడానికి కావాల్సిన నెంబర్‌ కంటే.. ఎక్కువే కనిపిస్తోంది. దీంతో సభలో కచ్చితంగా చర్చ జరగాల్సిందే.. అయితే మరి సభ ఆర్డర్‌లో ఉంచడంలో విపక్షాలన్నింటినీ కలపడంలో టీడీపీ - వైసీలు ఎంత వరకు సక్సెస్‌ అవుతాయో చూడ‌టం ముఖ్యం.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేందుకు కేవలం కాంగ్రెస్‌ మాత్రమే కాదు.. 34 మంది ఎంపీలున్న తృణమూల్‌, ఒక ఎంపీ ఉన్న ఎంఐఎం మద్దతు ప్రకటించేశాయి. ఎన్డీఏలో కొనసాగుతున్నా, బీజేపీ తీరుతో మండిపడుతున్న శివసేనకు 18 మంది ఎంపీలున్నారు. వీరందరూ అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారికంగా ఇంకా శివసేన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఎన్డీఏ కూటమిలో 4 ఎంపీలున్న అకాళీదళ్‌ - అవిశ్వాసం సందర్భంగా సభకు గైర్హాజరవుతామని ప్రకటించింది.. టీఆర్ఎస్‌ సైతం సభలో అవిశ్వాసంపై చర్చ జరిగితే ప్రభుత్వానికి వ్యేతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది. ఇదే రీతిలో రేప‌టివ‌ర‌కు క‌లిసి వ‌చ్చే పార్టీలు ఎన్ని అని అన్ని పార్టీలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి.