Begin typing your search above and press return to search.

సెల్ఫీ తీసుకొని..ఏపీలో ద‌ళిత ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌

By:  Tupaki Desk   |   24 Nov 2017 1:45 PM GMT
సెల్ఫీ తీసుకొని..ఏపీలో ద‌ళిత ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి బ‌ల‌వ‌న్మ‌రణం క‌ల‌క‌లంగా, హృద‌య‌విదార‌కంగా మారింది. ప్ర‌మోష‌న్ రాలేద‌నే కారణంతో ఆత్మ‌హ‌త్య‌కు సిద్ధ‌మైన ఆ ఉద్యోగి త‌న ఆవేద‌న‌ను వెల్ల‌బోసుకుంటూ సెల్ఫీ తీసుకొని మ‌రీ..ప్రాణాలు వ‌ద‌ల‌డం క‌ల‌కంగా మారింది. గుంటూరు జిల్లా పొన్నూరు పిహెచ్‌సీి ఉద్యోగి పని చేస్తున్న నన్నం రవికుమార్‌(50) గత మంగళవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు తొలుత ప్రభుత్వాసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, తర్వాత మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవటంతో బుధవారం మృతిచెందారు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు - కెేవీపీఎస్‌ - పలు దళిత సంఘాల నాయకులు గురువారం గుంటూరు జీజీహెచ్‌ శవాగారం ఎదుట రోడ్డుపై బైఠాయించి ఏడు గంటలపాటు రాస్తారోకో చేశారు.

కాగా, రవికుమార్‌ ఆత్మహత్యకు ముందుగా స్వయంగా మాట్లాడిన వీడియోను ఫేస్‌బుక్‌ - వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేయటం గమనార్హం. త‌న‌కు ప‌దోన్న‌తి కోసం లక్ష రూపాయ‌లు స‌మ‌ర్పించుకోవాల‌ని ఆర్డ‌ర్ వేశార‌ని...అంతగా ఇచ్చుకోలేని తాను క‌ష్ట‌ప‌డి రూ.70 వేలు జ‌మ‌చేసి అందించిన‌ప్ప‌టికీ...త‌న‌కు న్యాయం జ‌ర‌గలేద‌ని ఆయ‌న వాపోయాడు. కాగా, ర‌వికుమార్ భార్య మీడియాతో మాట్లాడుతూ... ఎప్పటి నుండో రావాల్సిన ప్రమోషన్ తనకు రాలేదని..డబ్బులు అడుగుతున్నారని..తన భర్త రవికుమార్ వాపోయారని భార్య పేర్కొంది. 2015లో కౌన్సిలింగ్ పెట్టారని...కానీ తన భర్తను పిలవలేదని పేర్కొన్నారు. పొన్నూరు వెళ్లాలని ఓ పేపర్ విసిరేశారని..ప్రమోషన్ విషయంలో భర్త రవికుమార్ రూ. 70 వేలు ఇచ్చారని తెలిపారు. పొన్నూరుకు తాను వెళ్లలేనని..ఆరోగ్యం బాగా లేదని బాధ పడ్డారని, నలుగురు ఉన్నతాధికారులు ఎంతగానో వేధించారని పేర్కొన్నారు. చివరకు తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారని, ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన మరణం తర్వాతనైనా ఇటువంటి పరిస్థితిని సంస్కరించాలని, తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌, అర్బన్‌ ఎస్పీలను వేడుకోవటం అందర్నీ కలచివేసింది. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న డిఎంహెచ్‌ఒ కార్యాలయ ఎఒ రత్నరాజు - సూపరింటెండెంట్‌ మల్లిఖార్జున్‌ - ప్రసాద్‌ - భానుమూర్తి ఈ నలుగురూ తన మృతికి కారణమని పేర్కొన్నారు.

కుటుంబ స‌భ్యులు, ద‌ళిత సంఘాల అభిప్రాయాల‌ ప్ర‌కారం ర‌వికుమార్‌ 26 ఏళ్లుగా జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అన్ని అర్హతలూ ఉన్నప్ప‌టికీ దళితుడైన ఒక్క కారణం చేత ఉద్యోగోన్నతి రాలేదు. గడిచిన రెండేళ్ల నుంచి పైస్థాయి అధికారుల్ని ఎంత సంప్రదించినా ఎటువంటి ప్రయోజనమూ లేకపోగా.. కులం పేరుతో దూషించారు. దీంతో ర‌వికుమార్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. రవికుమార్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆందోళన సందర్భంగా పలుమార్లు చర్చల అనంతరం కుమార్తెల్లో ఒకరికి ప్రభుత్వ, ఇద్దరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇస్తామని, బాధ్యులను సస్పెండ్‌ చేస్తామని డిఆర్‌ఒ నాగబాబు, డీఎస్‌సీి సరిత, కండే శ్రీనివాసులు హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.