Begin typing your search above and press return to search.

మ‌రో భారం మోప‌డ‌మెందుకు బాబు?

By:  Tupaki Desk   |   31 May 2016 2:03 PM GMT
మ‌రో భారం మోప‌డ‌మెందుకు బాబు?
X
రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితులు దృష్టిలో ఉంచుకోకుండా నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌నే అప‌ప్ర‌ద‌ను ఇప్ప‌టికే మోస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అదే త‌ర‌హాలో మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్పటికే కన్సల్టెన్సీలతో హోరెత్తిస్తున్న సీఎం చంద్రబాబ తాజాగా మరో వ్యవస్థకు తెరతీశారని స‌మాచారం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ చుట్టుపక్క రాష్ట్రాలలో అమలు జరుగుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, నివేదికలు తెప్పించుకునేందుకు సొంతంగా సీఎం ఫెలోస్‌ పేరున ఒక బృందాన్ని తయారు చేశారు.

ఐఐటి - ఐఐఎం - వంటి రంగాలలో నిపుణులైన 20 మంది యువతను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ బృందానికి ప్రభుత్వ శాఖల విధి విధానాలకు సంబంధించి, ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించారు. త్వరలోనే వారిని వివిధ రాష్ట్రాలకు అధికారికంగా పంపించి, ఆయా రాష్ట్రాల శాఖాపరమైన అంశాలపై అధ్యయనం చేయించాలని నిర్ణయించారు. ఇటీవల కాలంలో రాష్ట్ర పాలన‌ వ్యవస్థపై స‌రిగా సాగ‌డం లేద‌నే భావ‌న‌లో ఉన్న చంద్ర‌బాబు ఇతర రాష్ట్రాలలో ఉత్తమ విధానాలపై దృష్టి పెడుతున్నారని అందుకే ఈ నిర్ణ‌య‌మ‌ని చెప్తున్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణం - సచివాలయం నిర్మాణాల వంటి అంశాలపై దేశ విదేశాలలో అధ్యయనం చేసిన చంద్రబాబు బృందం - తాజాగా సిఎం ఫెలోస్‌ ని కూడా వినియోగించుకోవాలని చూస్తోందని సమాచారం. వీరికి కొన్ని శాఖలను కేటాయిస్తూ వాటిపై ఇతర రాష్ట్రాలలో అధ్యయనం చేయించాలని భావిస్తున్నారు. అయితే ఆర్థికంగా ఇది భార‌మ‌నే భావ‌న వినిపిస్తోంది.