Begin typing your search above and press return to search.

హైదరాబాద్ నుంచి మహాభినిష్ర్కమణం

By:  Tupaki Desk   |   25 Sep 2016 6:08 AM GMT
హైదరాబాద్ నుంచి మహాభినిష్ర్కమణం
X
ఉమ్మడి రాష్ట్రానికి ఎన్నో ఏళ్లుగా పాలన కేంద్రంగా ఉన్న హైదరాబాద్ సచివాలయం నుంచి నవ్యాంధ్ర పాలనకు పూర్తి ముగింపు పలికారు. శనివారమే అందుకు చివరి రోజైంది.

అమరావతి రాజధాని ప్రాంతంలోని వెలగపూడికి సచివాలయాన్ని తరలించే క్రమంలో భాగంగా శనివారం కంప్యూటర్ల పాస్‌ వర్డ్‌ లు - ఇంటర్నెట్‌ అనుసంధానం నిలిపివేశారు. కంప్యూటర్లలోని హార్డ్‌ డిస్క్‌ లను వాటినుంచి తొలగించి ప్రత్యేకంగా భద్రపరిచారు. కంప్యూటర్లు - ఫర్నీచర్లను ఆదివారం రాత్రి విజయవాడకు తరలిస్తారు. అయితే కొన్ని శాఖలు మాత్రం తమకు కొంత సమయం ఇవ్వాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఏ ఒక్క శాఖకు కూడా మినహాయింపు ఇచ్చేది లేదని, దసరా నాటికి వెలగపూడికి తరలి పోవాల్సిందేనంటూ ప్రభుత్వం స్పష్టంచేసింది. కొన్ని శాఖల్లో ఇప్పటికే కంప్యూటర్లు - ఫర్నీచర్లను ప్యాక్‌ చేశారు. మరికొన్ని శాఖల్లో ఆదివారం పూర్తి చేయనున్నారు. దీంతో శనివారం అనేక శాఖల్లోని సిబ్బంది ఇక్కడి సచివాలయంలో చివరి పనిరోజుగా భావించారు.

ఇదిలాఉండగా, ప్రభుత్వ శాఖలన్నీ అక్టోబర్‌ 3 నుంచి వెలగపూడి సచివాలయం నుంచి పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభించనున్నాయి. ఇందుకోసం సచివాలయంలోని అన్ని శాఖలను తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దసరా నుంచి వెలగపూడి కేంద్రంగా పూర్తిస్థాయి పరిపాలన ప్రారంభిస్తామ ని గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఏర్పాట్లు చేస్తున్నారు.