Begin typing your search above and press return to search.

కేంద్రానికి బీజేపీ లేఖ‌...ఈ గ‌వ‌ర్న‌ర్ మాకొద్దు

By:  Tupaki Desk   |   16 Jan 2018 4:13 PM GMT
కేంద్రానికి బీజేపీ లేఖ‌...ఈ గ‌వ‌ర్న‌ర్ మాకొద్దు
X
తెలుగు రాష్ర్టాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ విష‌యంలో కీల‌క ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇటీవ‌లి కాలంలో తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీజేపీ సైతం గ‌వ‌ర్న‌ర్ తీరును త‌ప్పుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్ ప‌నితీరుపై బీజేపీ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ కేంద్రంలోని త‌మ పెద్ద‌ల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో తెలంగాణ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత జి.కిష‌న్ రెడ్డి, ఏపీ ప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు సైతం వేర్వేరు సంద‌ర్భాల్లో గ‌వ‌ర్న‌ర్‌పై త‌మ అసంతృప్త వైఖ‌రిని వెల్ల‌డించారు. ఇప్పుడు ఏకంగా కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు బీజేపీకి చెందిన‌ పార్లమెంటు సభ్యుడు హరిబాబు లేఖ రాశారు. త‌మ‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్‌ను కేటాయించాల‌ని కోరారు.

కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖ‌లో....నవ్యాంధ్రకు కొత్త గవర్నర్‌ను నియమించాలని హ‌రిబాబు విజ్ఞప్తి చేశారు. అలాగే... హైకోర్టు కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం భవనాలను అన్వేషిస్తోందని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఏర్పాటుకు వెంటనే చొరవ తీసుకోవాలని ఆ లేఖలో ఎంపీ హ‌రిబాబు కోరారు. ఇదిలా ఉండగా ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్‌పై సవతితల్లి ప్రేమను చూపిస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఇప్పటికే మీడియా ముఖంగా విమర్శలు చేశారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ హరిబాబు కేంద్ర హోమంత్రికి లేఖ రాయడంతో ఇప్పుడు ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా లేఖ‌పై కేంద్రం ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సిందే.

ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌తిప‌క్ష నేత కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌పై తాము ఇప్ప‌టికే ఫిర్యాదు చేశామ‌ని...మ‌ళ్లీ చేస్తామ‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. దానికి కొనసాగింపుగా నాలా చ‌ట్టం విష‌యంలో విష్ణుకుమార్ రాజు సైతం గ‌వ‌ర్న‌ర్ వైఖ‌రిని త‌ప్పుప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఎంపీ హ‌రిబాబు లేఖ రాయ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది.