Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క‌లో కేసీఆర్ కు జైకొట్టిన అస‌ద్‌

By:  Tupaki Desk   |   16 April 2018 8:32 AM GMT
క‌ర్ణాట‌క‌లో కేసీఆర్ కు జైకొట్టిన అస‌ద్‌
X
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన సంగ‌తి తెలిసిందే. మే నెల 12న ఒకే దశలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో కన్నడ రాష్ట్రంలో ఎన్నికల రణానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అన్ని పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. అయితే హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ కేంద్రంగా ఏర్ప‌డిన ఎంఐఎం పార్టీ కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై కన్నేసినట్లు వ‌చ్చిన వార్త‌లకు తెర‌ప‌డింది. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్ర‌క‌టించారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్ కు మద్దతు ఇచ్చి.. ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. దీంతో క‌న్న‌డ ఎన్నిక‌ల్లో జేడీఎస్‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్న టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌కు అస‌ద్ ఓకే చెప్పిన‌ట్ల‌యింది.


మే 12న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అసదుద్దీన్‌కు చెందిన పార్టీ సుమారు 40 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోందని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇటీవల పార్లమెంట్‌లో ఓవైసీతో మాజీ ప్రధాని దేవగౌడ మాట్లాడారు. దీంతో రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఖాయ‌మ‌ని జేడీఎస్‌తో జత కట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా అసద్ పార్టీ నేతలు వెల్లడించారు. దీన్ని నిజం చేస్తూ అస‌ద్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ - బీజేపీ పూర్తిగా విఫలమయ్యాయని ఓవైసీ పేర్కొంటూ తాము జేడీఎస్‌కు మ‌ద్ద‌తిస్తున్నామ‌ని తెలిపారు. అంతేకాకుండా ప్ర‌చారం సైతం చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. ఇప్ప‌టికే థ‌ర్డ్ ఫ్రంట్ హ‌డావుడిలో ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కర్ణాట‌క‌లో ప‌ర్య‌టించిన జేడీఎస్ అధినేత దేవేగౌడ‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా తెలుగువారంతా జేడీఎస్‌కు ఓటు వేయాల‌ని పిలుపునిచ్చారు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తామని ఈ ఏడాది జనవరిలో ఓవైసీ ప్రకటించిన విషయం విదితమే. కేసీఆర్ ఈ ప్ర‌క‌ట‌న చేసిన రెండు మూడు రోజుల్లోనే అస‌ద్ కూడా జేడీఎస్‌కు మ‌ద్ద‌తు విష‌యం వెల్ల‌డించడం గ‌మ‌నార్హం.

కాగా, బీజేపీ కొనసాగిస్తున్న జైత్రయాత్ర కాంగ్రెస్ చివరి కంచుకోటను సైతం కైవసం చేసుకుంటుందా లేదా అనేది మే 15న తేలిపోనుంది. ఈ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగిస్తామని, వాటిని ఓటును తనిఖీ చేసుకొనే వీవీపీఏటీ యంత్రాలకు అనుసంధానం చేస్తామని ఈసీ పేర్కొంది. 2013లో 4,36,85,739 మంది ఓటర్లు ఉండగా.. 2018నాటికి ఈ సంఖ్య 4,96,82,351కి పెరిగింది.