Begin typing your search above and press return to search.

మత్తయ్య నోటీసులో ‘హామీ’ ఇచ్చిన ఏసీబీ

By:  Tupaki Desk   |   13 Feb 2016 6:25 AM GMT
మత్తయ్య నోటీసులో ‘హామీ’ ఇచ్చిన ఏసీబీ
X
ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక మొదలైంది. గత కొద్ది నెలలుగా ఎలాంటి కదలిక లేని ఈ కేసులో తాజాగా ఒకటి తర్వాత మరొకటిగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండు.. మూడు రోజులకే ఓటుకు నోటు కేసు వ్యవహారం తెరపైకి రావటం.. ఈ ఉదంతంలో రేవంత్ రెడ్డి వెంట వచ్చిన డబ్బుల బ్యాగుల్లో మొత్తాన్ని సర్దుబాటు చేసింది టీటీడీపీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేరు తెరపైకి వచ్చింది.

మాగంటికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారన్న వాదన వినిపిస్తున్న సందర్భంలోనే.. ఆయనకు నోటీసులు ఇచ్చే స్థానే.. ఈ కేసులో ఏ4గా ఉన్న మత్తయ్యకు నోటీసులు ఇచ్చారు ఏసీబీ అధికారులు. గతంలో మత్తయ్యకు నోటీసులు ఇచ్చి.. అరెస్ట్ చేస్తారన్న మాట వినిపించిన సమయంలో అతను ఏపీకి వెళ్లిపోవటం.. అక్కడే కొంతకాలం ఉండిపోవటం తెలిసిందే.

తాజాగా మత్తయ్యకు నోటీసులు ఇచ్చిన ఏసీబీ అధికారులు.. ఒక అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించటం ఆసక్తికరంగా మారింది. విచారణకు వచ్చే మత్తయ్య తనతో పాటు లాయర్ ను తెచ్చుకోవచ్చని.. అతన్ని అరెస్ట్ చేయమని పేర్కొనటం గమనార్హం. విచారణకు నోటీసులు ఇచ్చే సమయంలో అరెస్ట్ చేయమన్న ముందస్తు హామీ ఇవ్వటంలో ఏసీబీ అధికారుల ఆలోచన ఏమిటన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.