Begin typing your search above and press return to search.

ఏపీ అవినీతి అధికారి ఆస్తి..జ‌స్ట్ రూ.500 కోట్లు

By:  Tupaki Desk   |   25 Sep 2017 4:13 PM GMT
ఏపీ అవినీతి అధికారి ఆస్తి..జ‌స్ట్ రూ.500 కోట్లు
X
క‌ట్టల కొద్దీ నోట్లు...గుట్టల కొద్దీ బంగారం...కోట్లు విలువచేసే స్థలాలు...ఇది ప‌రిచ‌యం. ఈ ప‌రిచ‌యం ఎవ‌రో దుబాయ్ షేక్ గురించో....అమెరికాకు చెందిన ఆగ‌ర్భ శ్రీ‌మంతుడి గురించో ప‌రిచ‌యం కాదు. ఓ ప్ర‌భుత్వ అధికారి గురించి. ఆయ‌నే ఏపీకి విశాఖ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ జీవీ రఘు. ఏసీబీ దాడుల్లో బ‌య‌ట‌ప‌డిన నిజాలు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలు రావడంతో ఎన్‌ వీ రఘు సహా ఆయన సన్నిహితులు - బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంగళగిరిలో 15 - విజయవాడలో 5 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. విశాఖ - రాజమండ్రి - మంగళగిరి - విజయవాడ - నెల్లూరు - తిరుపతి - షిర్డీల్లో రఘు ఆస్తులపై దాడులు కొనసాగాయి.

క‌ళ్లు తిరిగే ఈ అవినీతి గురించి ఏసీబీ డీజీ ఠాకూర్ మీడియాతో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో కోట్లాది రూపాయల విలువైన భూములు - భవనాలు - ఆస్తి పత్రాలు - బంగారు ఆభరణాలు - కరెన్సీ కట్టలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ జరిగిన సోదాల్లో రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లుగా గుర్తించామ‌న్నారు. గన్నవరంలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ - షిర్డీలో ఒక లాడ్జి - వేల్పూరులో రెండెకరాల వ్యవసాయ భూమి - గన్నవరంలోని ఓ అపార్ట్‌ మెంట్‌ లో 16 ఫ్లాట్లు ఉన్నట్లుగా ఉన్న పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. అలాగే రఘుకు బినామీలుగా ఉన్న నల్లూరి వెంకట శివప్రసాద్‌ - గాయత్రి దంపతుల ఇళ్లలో సోదాలు చేయగా కేజీల కొద్దీ బంగారం - వెండి బయటపడిందని పేర్కొన్నారు. రూ.50 లక్షల నగదు - 15 కేజీల బంగారం - 25 కేజీల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్ర‌క‌టించారు. అంతేకాక రఘు, ప్రసాద్‌ ఇళ్లలో పదుల సంఖ్యలో వడ్డాణాలు - చెవి దిద్దులు - ఉంగరాలు - వెండి గిన్నెలు - ప్లేట్లు - బక్కెట్లు - గ్లాసులు ఇలా ఎన్నో వస్తువులను ఏసీబీ గుర్తించి స్వాధీనం చేసుకుంద‌ని వెల్ల‌డించారు.

టౌన్ ప్లానింగ్ అధికారి రఘుకు సంబంధించిన అక్రమ ఆస్తులపై జ‌రిపిన‌ సోదాల్లో దొరికిన పత్రాలపై దర్యాప్తు జరుగుతుంద‌ని ఏసీబీ డీజీ ఠాకూర్ వివ‌రించారు. ఆయ‌న‌కున్న లింకులపై సమగ్రంగా విచారణ చేస్తున్నామని తెలిపారు. దొరికిన మొత్తం ఆస్తుల విలువ వందల కోట్లలో ఉందని అయితే మార్కెట్ అంచ‌నా ఎంతుంటుందో తాము చెప్ప‌లేమ‌ని అన్నారు. గ‌తంలో హైద్రాబాద్ - విజయవాడ - వైజాగ్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా పని చేశారని వివ‌రించారు. కాగా, ఆయ‌న ఆస్తులు సుమారు రూ.500 కోట్లు ఉంటుంద‌ని తెలుస్తోంది.