Begin typing your search above and press return to search.

జీతం రూ.60వేలు.. ఆస్తి రూ.200 కోట్లు

By:  Tupaki Desk   |   19 Nov 2017 4:34 AM GMT
జీతం రూ.60వేలు.. ఆస్తి రూ.200 కోట్లు
X
నెల‌కు జీతం రూ.60వేలు ఉంటే.. స‌ద‌రు అధికారి ఆస్తులు ఎంత మేర ఉండే అవ‌కాశం ఉంటుంది. మ‌హా అయితే కోటి. నిజానికి అది కూడా సాధ్యం కాదు. త‌ల్లిదండ్రుల నుంచి పూర్వీకుల నుంచి ఆస్తులు వ‌చ్చి ఉంటే ఆ మాత్రమ‌న్నా ఉంటుంది. కానీ.. రూ.200కోట్లు సాధ్య‌మేనా? కానీ.. అలాంటిది సాధ్య‌మేన‌న్న వైనం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఏపీకి చెందిన విజ‌య‌న‌గ‌ర జిల్లా స‌ర్వే భూరికార్డుల స‌హాయ డైరెక్ట‌ర్‌ కార్యాల‌యంలో స‌ర్వే ఇన్ స్పెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించే గేదెల ల‌క్ష్మీ గ‌ణేశ్వ‌ర‌రావు ఆస్తుల మీద అధికారులు జ‌రిపిన త‌నికీల్లో క‌ళ్లు తిరిగే వాస్త‌వాలుబ‌య‌ట‌కు వ‌చ్చాయి. విశాఖ భూకుంభ‌కోణంలో నిందితుడిగా ఉన్న అత‌గాడు ప్ర‌స్తుతం ప‌స్పెన్ష‌న్ లో ఉన్నాడు.

అత‌డి ఇంట్లో పాటు.. బంధువులు.. స్నేహితులు.. బినామీల ఇళ్ల‌పైనా ఒకేసారి త‌నిఖీలు నిర్వ‌హించారు. మొత్తం 18 చోట్ల ఏక‌కాలంలో నిర్వ‌హించిన సోదాల‌తో క‌ళ్లు చెదిరే ఆస్తులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

విశాఖ‌ప‌ట్నం.. తూరు.. ప‌శ్చిమ గోదావ‌రి.. విజ‌య‌న‌గ‌రం.. హైద‌రాబాద్ ల‌లో వివిధ ప్రాంతాల్లో అత‌డికున్న ఆస్తులు మార్కెట్ విలువ ప్ర‌కారం రూ.200 కోట్ల వ‌ర‌కు ఉంటాయ‌ని తేల్చారు. త‌నిఖీల‌కు ల‌క్ష్మీగ‌ణేశ్వ‌ర‌రావు ఇంటికి వెళ్లిన ఏసీబీ డీఎస్పీ ర‌మాదేవి విశాఖ‌లోని శ్రీ‌న‌గ‌ర్ ప్రాంతంలోని ఇంటికి వెళ్లారు. అయితే.. ల‌క్ష్మీ గ‌ణేశ్వ‌ర‌రావు ఇంట్లో లేర‌ని హైద‌రాబాద్‌కు వెళ్లిన‌ట్లుగా ఇంట్లోని వారు చెప్పారు. అనుమానం వ‌చ్చిన ఏసీబీ బృందం ఇంట్లోని పైభాగంలోకి వెళ్ల‌గా పెంట్ హౌస్ కు తాళం వేసి ఉంది. సెల్ ఫోన్ సిగ్న‌ల్ ఆధారంగా సెల్ ట‌వ‌ర్ లొకేష‌న్ ను గుర్తించిన అధికారులు అత‌డ్ని పెంట్ హౌస్ లో దాక్కున్న‌ట్లుగా గుర్తించారు.

పెంట్ హౌస్ తాళాలు ప‌గ‌ల‌గొట్టించిన అధికారుల‌పై గ‌ణేశ్వ‌ర‌రావు ఫైర్ అయ్యాడు. త‌న‌పై దాడికి పాల్ప‌డుతున్నార‌ని.. ప్రైవేటు కేసు న‌మోదు చేస్తాన‌ని ఏసీబీ అధికారుల‌పై బెదిరింపుల‌కు దిగాడు. అదే స‌మ‌యంలో అక్క‌డ‌కు వెళ్లిన మీడియా సిబ్బందికి షాకిస్తూ.. వారిపై కుక్క‌ల్ని ఉసిగొల్పాడు. దీంతో.. అత‌డిపై పోలీస్ స్టేష‌న్లో కేసు పెట్టారు. లేని ఆస్తులు ఉన్న‌ట్లుగా న‌కిలీ ప‌త్రాలు సృష్టించి.. బ్యాంకుల్లో తాక‌ట్టుపెట్టి కోట్ల రూపాయిల్లో రుణాలు తీసుకునేవాడ‌ని ఏసీబీ అధికారులు గుర్తించారు.ఇదే తీరులో త‌న‌కు లేని భూమిని ఉంద‌ని చూపించి బ్యాంకు నుంచి ఏకంగా రూ34 కోట్లు రుణం పొంద‌టం గ‌మ‌నార్హం.

గ‌తంలో రెండుసార్లు ఏసీబీకి ప‌ట్టుబ‌డిన గ‌ణేశ్వ‌ర‌రావు తాజాగా మ‌రోసారి బుక్ అయ్యారు. ఈసారి అత‌డి ఆస్తుల‌న్నింటి మీద దృష్టి పెట్ట‌టంతో మార్కెట్ వాల్యూ ప్ర‌కారం అత‌డి ఆస్తి రూ.200 కోట్ల‌కు పైనే ఉంటుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే గ‌ణేశ్వ‌ర‌రావు కేవ‌లం ఐదేళ్ల వ్య‌వ‌ధిలో రూ.200 కోట్ల మేర ఆస్తుల్ని కూడ‌బెట్టిన‌ట్లుగా గుర్తించారు. కుటుంబ‌స‌భ్యుల‌పైనా.. బంధువులు.. స్నేహితులు.. బినామీల పేరుతో ఆయ‌న ప‌లు లావాదేవీల్ని నిర్వ‌హించిన‌ట్లుగా అధికారులు గుర్తించారు.