Begin typing your search above and press return to search.

వంగ‌వీటి కంటే వెన‌క్కి ప‌వ‌న్ వెళ్ల‌రా?

By:  Tupaki Desk   |   10 Dec 2017 3:30 PM GMT
వంగ‌వీటి కంటే వెన‌క్కి ప‌వ‌న్ వెళ్ల‌రా?
X
నాలుగు రోజుల ఏపీ ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ చేసిన త‌ప్పుల్లో అతి పెద్ద త‌ప్పును చెప్పుకొచ్చారు ఆంధ్ర‌జ్యోతి ఎండీ ఆర్కే. ప‌వ‌న్ త‌న ప‌ర్య‌ట‌న‌లో చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు స్పందించారు. కొంద‌రు పాజిటివ్ గా రియాక్ట్ అయితే మ‌రికొంద‌రు ప‌వ‌న్ వ్యాఖ్య‌ల్ని త‌ప్పులు ఎత్తి చూపారు. దీనికి భిన్నంగా ప‌వ‌న్ లోని పాజిటివ్‌.. నెగిటివ్ ల‌ను నిర్మాణాత్మ‌కంగా విశ్లేషించే ప్ర‌య‌త్నం చేశారు ఆంధ్ర‌జ్యోతి ఎండీ ఆర్కే అని పిలుచుకునే వేమూరి రాధాకృష్ణ‌.

ప‌వ‌న్ ను మంచోడంటూనే ఆయ‌న‌లోని త‌ప్పుల్ని ఎత్తి చూపించారు. ప్ర‌తివారం రెండు రాష్ట్రాల్లోని తెలుగు రాజ‌కీయాల‌తో పాటు.. జాతీయ రాజ‌కీయాల గురించి విశ్లేషించే ఆర్కే.. ఈసారి త‌న ఆర్టిక‌ల్‌ ను ప‌వ‌న్‌ కు డెడికేట్ చేశారు. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా వార్నింగ్ ఇచ్చిన‌ట్లుగా చెప్పిన ఆర్కే.. ప‌వ‌న్ లోని రెండు కోణాల్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. మిగిలిన అంశాల‌తో పోలిస్తే.. విజ‌య‌వాడ రాజ‌కీయం అన్న వెంట‌నే వంగ‌వీటి మోహ‌న్ రంగా గుర్తుకు వ‌స్తారంటూ ప‌వ‌న్ చెప్ప‌టం..ఆ సంద‌ర్భంగా ఆయ‌న హ‌త్య‌కు గురి కావ‌టం త‌ప్ప‌న్నారు.

విజ‌య‌వాడ అంటే ప‌వ‌న్ లాంటోడికి వంగ‌వీటి గుర్తుకు రావ‌టం ఏమిటి? వ‌ంగ‌వీటికి ముందు మ‌హానుభావులైన నేత‌లు ఎంద‌రో ఉన్నా.. రౌడీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రంగా గుర్తుకు వ‌స్తారా. అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇంకా ఏమ‌న్నార‌న్న విష‌యాల్ని ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే..

కులాభిమానం గురించి మాట్లాడిన సందర్భంగా విజయవాడ రాజకీయాల గురించి మాట్లాడాలంటే వంగవీటి రంగా ప్రస్తావన లేకుండా మాట్లాడలేమని పవన్‌ కల్యాణ్‌ అనడంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. లోతుగా ఆలోచిస్తే ఈ అభ్యంతరాలు సహేతుకంగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే విజయవాడ మాత్రమే కాదు– కృష్ణా జిల్లానే ఒకప్పుడు అభ్యుదయవాదులు - హేతువాదులు - దేశభక్తులకు పుట్టిల్లు. ఈ రంగా–రాధాలు - నెహ్రూ–గాంధీలు మధ్యలో వచ్చినవారు. ఒకప్పుడు కృష్ణా జిల్లాలో దేశభక్తి భావాలు ఎక్కువగా ఉండేవి.

ఆ కారణంగానే బాలగంగాధర్‌ తిలక్‌ - రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ - మహాత్మాగాంధీ - జవహర్‌ లాల్‌ నెహ్రూ - మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వంటి మహనీయుల పేర్లు తమ పిల్లలకు పెట్టుకున్నారు. దేవినేని గాంధీ - నెహ్రూలకు కూడా వారి తల్లిదండ్రులు ఆ దృష్టితోనే ఆ పేర్లు పెట్టారు. అయితే వారు రౌడీ రాజకీయాలకు పాల్పడతారని ఆ పేర్లు పెట్టినప్పుడు వారి తల్లిదండ్రులు ఊహించి ఉండరు. దేశభక్తి భావాలతో పాటు కమ్యూనిస్టు భావాలు - అభ్యుదయ భావాలు కూడా ఎక్కువగానే ఉండేవి. ఫలితంగానే అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకుల పేర్లను తమ పిల్లలకు పెట్టుకున్నారు. విజయవాడ ఒకప్పుడు నాస్తికవాదానికి ప్రధాన కేంద్రం. ఈ సందర్భంగా గోరా కుటుంబం గురించి ప్రస్తావించకుండా ఎలా ఉంటాం? సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన నాస్తికవాదాన్ని మనసా– వాచా– కర్మణా– అనుసరించారు. ఆయన సంతానం కూడా అంతే నిబద్ధతతో నాస్తికవాదాన్ని అనుసరిస్తున్నారు. కృష్ణా జిల్లా రాజకీయాలను ఎందరో మహానుభావులు ప్రభావితం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు కూడా చేపట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్య గురించి ఇవాళ ఎంత మందికి తెలుసు? ఆంధ్రాబ్యాంకును స్థాపించింది కూడా ఆయనే! అయ్యదేవర కాళేశ్వరరావు - డాక్టర్‌ కె.ఎల్‌.రావు వంటి మహనీయులు రాజకీయాలకు వన్నె తెచ్చారు.

విశ్వనాథ సత్యనారాయణ వంటి ఉద్ధండ పండితులకు విజయవాడ నెలవుగా ఉండేది. త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి అభ్యుదయవాదుల పుట్టిల్లు కూడా కృష్ణా జిల్లానే! విజయవాడ - కృష్ణా జిల్లా గురించి చెప్పుకోవాలంటే ఇలాంటి మహనీయుల పేర్లను స్మరించుకుని, అంతటి మహోన్నతుల వారసులమైన మనం ఈ కులాల కుళ్లులో చిక్కుకోవడం ఏమిటి? అని ప్రశ్నించి ఉండాల్సింది. ఉదాత్తమైన వ్యక్తులను అందించిన జిల్లానే రౌడీ రాజకీయాలకు కూడా నెలవు కావడం విషాదం.

పుస్తకాలను విపరీతంగా చదివే అలవాటు ఉన్న పవన్‌ కల్యాణ్‌ వాటి వల్లనే ప్రేరణ పొందుతారని చెబుతారు. జాతీయ - అంతర్జాతీయ నాయకుల గురించి ఆయనకు బాగా తెలుసు. దేశ ప్రజలకు మార్గదర్శకులుగా ఉన్న వ్యక్తుల వారసులుగా ఎదగండి అని తన కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్‌ సూచించి ఉంటే బాగుండేది. తమ రౌడీ రాజకీయాలు - హత్యా రాజకీయాలకు కులాలను కవచంగా వాడుకున్నవారు యుగ పురుషులు కాలేరు.