Begin typing your search above and press return to search.

కోర్టుకు ఎమ్మెల్యేలు...ఎన్నిక‌ల‌కు సిద్ధం

By:  Tupaki Desk   |   23 Jan 2018 9:38 AM GMT
కోర్టుకు ఎమ్మెల్యేలు...ఎన్నిక‌ల‌కు సిద్ధం
X
లాభదాయక పదవుల్లో కొన‌సాగుతుండ‌టం వ‌ల్ల‌ అనర్హత వేటుకు గురైన ఎపిసోడ్ మ‌లుపులు తిరుగుతోంది. అన‌ర్హ‌త ఇరవై మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమపై విధించిన అనర్హత వేటును రద్దు చేయాలంటూ ఆ ఎమ్మెల్యేలు కోర్టును వేడుకున్నారు. లాభదాయకమైన పదువులు కొనసాగుతున్న 20 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటీవల ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. ఆ ప్రతిపాదన మేరకు రాష్ట్రపతి కూడా వేటు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు వేసిన పిటీషన్‌ పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.

మ‌రోవైపు ఆమ్‌ ఆద్మీపార్టీ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఎమ్మెల్యేల‌పై ఎన్నికల సంఘం ప్ర‌తిపాద‌న‌, రాష్టప్రతికి ఆమోదం వేసినంత మాత్రాన భయపడొద్దని అధికార ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయన్న భయం అక్కర్లేదని బాధిత ఎమ్మెల్యేలకు ఢిల్లీ ఆప్ విభాగం అధ్యక్షుడు గోపాల్ రాయ్ స్పష్టం చేశారు. పార్టీ అభిప్రాయం తెలుకోకుండానే ఈసీ ఏకపక్షంగా రాష్టప్రతికి సిఫార్సు చేసిందని ఆయన ఆరోపించారు. ‘ఈసీ చర్య నూటికి నూరుపాళ్లూ అప్రజాస్వామికం. ఢిల్లీ ప్రజలపై, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పై జరుగుతున్న కక్ష సాధింపులో భాగమే ఇదంతా’ అని ఆయన విమర్శించారు. పార్లమెంటు కార్యదర్శుల పదవులన్నవి 11 రాష్ట్రాల్లో అమలవుతున్నాయని, ఇది ఒక్క ఢిల్లీ రాష్ట్రానికే పరిమితం కాదని గోపాల్ చెప్పారు. ఈ ద్వంద్వ విధానం రాజ్యాంగ విరుద్ధమేనని ఆయన అన్నారు.

ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపునకు ఇది పరాకాష్టగా చెప్పవచ్చని ఆప్ చీఫ్ ఎద్దేవా చేశారు. బ్రిటీష్ పాలనకన్నా దారుణంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈసీ కక్ష సాధింపుపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతామని రాయ్ వెల్లడించారు.`ఢిల్లీ ప్రజలు మాతోనే ఉన్నారు. ఎన్నికలకు మేం భయపడం. ప్రజలే న్యాయనిర్ణేతలు. వారి అభీష్టం మేరకే నడుచుకుంటాం’ అని ఆయన ఉద్ఘాటించారు. ఈసీ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టులో ఆప్ సవాల్ చేయగా నేడు విచారణకు వ‌చ్చింది.