Begin typing your search above and press return to search.

‘వీడియో’ ఎంపీని పార్లమెంటుకు రావద్దన్నారు

By:  Tupaki Desk   |   26 July 2016 4:44 AM GMT
‘వీడియో’ ఎంపీని పార్లమెంటుకు రావద్దన్నారు
X
తన నివాసం నుంచి పార్లమెంటులోకి ప్రవేశించేంత వరకూ వీడియో తీసిన వివాదాస్పద ఆమ్ ఆద్మీ ఎంపీ భగవంత మాన్ పై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వేటు వేశారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే వ్యవహరించిన సదరు ఎంపీ భాగోతం తీవ్ర కలకలాన్ని సృష్టించటమే కాదు.. పెద్ద ఎత్తున విమర్శలకు గురైంది. అయితే.. ఈ వ్యవహారంపై సదరు ఎంపీ తనను తాను కవర్ చేసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

వీడియో తీసి.. తన నియోజకవర్గ ప్రజలకు చూపించాలన్న ఉద్దేశంతోనే తానీ పని చేసినట్లుగా భగవంత మాటల్ని స్పీకర్ పరిగణలోకి తీసుకోలేదు. భగవంత తీరుపై పార్లమెంటులోని పలు రాజకీయ పక్షాలు తీవ్రంగా తప్పు పట్టాయి. ఈ నేపథ్యంలో 9 మంది ఎంపీలతో కూడిన విచారణ కమిటీని వేసిన స్పీకర్.. సదరు కమిటీ నివేదిక ఇచ్చే వరకూ ఆయన్ను సభకు రావొద్దంటూ ఆదేశించారు.

అదే సమయంలో విచారణ కమిటీకి సమయాన్ని నిర్దేశించిన స్పీకర్.. మంగళవారం ఉదయం 10.30 గంటల లోపు తమ నిర్ణయం వెల్లడించాలని కోరారు. కమిటీ సభ్యులుగా బీజేపీ.. శివసేన.. బీజేడీ.. టీఎంసీ.. టీడీపీ.. కాంగ్రెస్.. అన్నాడీఎంకేకు చెందిన ఎంపీలు ఉన్నారు. సో.. వీడియో ఎంపీగారి ప్యూచర్ ఈ రోజుతో తేలిపోనుందని చెప్పాలి.