Begin typing your search above and press return to search.

అమెరికాలో గ్రీన్ కార్డ్...హైద‌రాబాద్‌ లో బిచ్చ‌గ‌త్తె

By:  Tupaki Desk   |   21 Nov 2017 11:11 AM GMT
అమెరికాలో గ్రీన్ కార్డ్...హైద‌రాబాద్‌ లో బిచ్చ‌గ‌త్తె
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అన్నీ ఆశ్చర్య‌పోయే క‌థ‌నాలే వెలుగులోకి వ‌స్తున్నాయి! ఆమె భ‌ద్ర‌త‌ - ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల గురించి ఇప్ప‌టివ‌రకు ఆశ్చ‌ర్య‌పోయే సమాచారం వెలువడగా...తాజాగా మ‌రో విస్మ‌య‌క‌ర అంశం తెరమీదకు వ‌చ్చింది. ఇవాంకా ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జీహెచ్‌ ఎంసీ - జైళ్ల శాఖ చేపట్టిన బెగ్గర్ ఫ్రీ సిటీ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. భిక్షాటన చేసే వారిని చంచల్‌ గూడ - చర్లపల్లి జైళ్లలోని ఆనంద్ ఆశ్రమాలకు తరలించి.. వారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇద్దరి మహిళల కథ ఆశ్చర్యపరిచింది. ఒకరు అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్ అయితే.. మరొకరు కోటిశ్వర్లు. అయినా వీరిద్ద‌రూ బిచ్చ‌మెత్తుకుంటున్నారు.

రబియా బసీరా అనే మ‌హిళ అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్ అంతేకాదు అక్కడ టీచర్‌ గా కూడా పని చేసింది. నగరంలో కోట్ల ఆస్తి ఉంది. కొన్ని ఏళ్ల‌ క్రితం భర్త చనిపోవడంతో.. కూతురుతో ఉండేది. కూతురు కూడా మృతి చెందింది. కుమారులు పట్టించుకోవడం లేదు. కూతురు పిల్లలను ఈవిడ వద్దనే వదిలేసి.. అల్లుడు వెళ్లిపోయాడు. రబియాకున్న కోట్ల ఆస్తిని బంధువులు లాగేసుకున్నారు. మనువళ్ల పోషణ ఆవిడకు భారంగా మారింది. దిక్కుతోచని స్థితిలో షేక్‌ పేట దర్గా వద్ద భిక్షాటన చేస్తోంది. ఈవిడ కూడా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతుంది. మనువళ్ల మీద బెంగ పెట్టుకున్న రబియా పరిస్థితిని చూసి జైలు అధికారులు కన్నీరు పెట్టుకున్నారు. మొత్తానికి రబీయా బంధువులను పిలిపించి.. రబియాను మంచిగా చూసుకుంటామనే ఆఫిడవిట్ రాయించి ఆవిడను జైలు అధికారులు ఇంటికి పంపించారు.

ఇక హైదరాబాద్ ఆనంద్‌ బాగ్‌ లో నివాసముండే ఫర్జానా(50) ఎంబీఏ చదివింది. ఒకప్పుడు లండన్‌ లో అకౌంట్స్ అధికారిణిగా పని చేసింది. రెండేళ్ల క్రితం ఆమె భర్త చనిపోవడంతో కుమారుడి దగ్గర ఉంటోంది. కుమారుడు వృత్తి రీత్యా ఆర్కిటెక్చర్. ఇటీవలే ఫర్జానా అనారోగ్యానికి గురైంది. రోగం తగ్గాలంటే దయ ఉండాలని తల్లికి కుమారుడు సూచించాడు. అందుకు భిక్షాటన చేయాలని తల్లికి చెప్పాడు కుమారుడు. దీంతో ఏమి చేసేది లేక ఫర్జానా.. లంగర్‌ హౌజ్‌ లోని ఓ దర్గా వద్ద భిక్షాటన చేస్తోంది. ఈ నెల 11న ఆవిడను చర్లపల్లి జైలులోని ఆనంద్ ఆశ్రమానికి తీసుకువచ్చి ఆమె వివరాలు తెలుసుకుని జైలు అధికారులు ఆశ్చర్య పోయారు. ఈవిడ చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడమే కాదు.. హిందీ - ఉర్దూతో పాటు పలు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. తల్లిని వదిలించుకోవడం కోసమే భిక్షాటన నాటకం ఆడాడని అధికారులు భావించిన జైలు అధికారులు కుమారుడిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంత‌రం ఆమెను ఇంటికి పంపించారు.