Begin typing your search above and press return to search.

2జీ స్కాం కాదు...పెద్ద కుట్ర‌

By:  Tupaki Desk   |   19 Jan 2018 4:43 PM GMT
2జీ స్కాం కాదు...పెద్ద కుట్ర‌
X
2జీ స్పెక్ట్రం కేటాయింపు..దేశ చ‌రిత్ర‌లోనే అవినీతిలో రికార్డు సృష్టించిన కుంభ‌కోణం. అయితే ఇందులో నిజం లేద‌ట‌.కేంద్ర టెలికం మాజీ మంత్రి ఏ రాజా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 2008లో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో మో సం చేశారని, అవినీతికి పాల్పడ్డారని ఏ రాజా - తదితరులపై వచ్చిన అభియోగాలను గత నెలలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసిన సంగతి తెలిసిందే. 2జీ సాగా అన్‌ ఫోల్డ్ (2జీలో వెలుగు చూడని నిజాలు) అనే పేరుతో రాసిన పుస్తకంలో రాజా సంచలన ఆరోపణలు చేశారు.

2జీ స్కాం వ‌ల్ల‌..ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందన్న నాటి కాగ్ వినోద్‌ రాయ్ ఆరోపణల వెనుక రహస్య వ్యక్తిగత ఉద్దేశాలు దాగి ఉన్నాయని ఆరోపించారు. నాటి కాగ్ వినోద్‌ రాయ్ భుజాలపై తుపాకీ పెట్టి యూపీఏ -2ను అంతం చేసే రాజకీయ వ్యూహంతో తనపై విచారణ జరిగిందని ఆరోపించారు. ఈ విషయాన్ని యూపీఏ 2 హయాంలోని పలు నిఘా సంస్థలు గుర్తించలేదన్నారు. వినోద్ రాయ్ నాటి యూపీఏ ప్రత్యర్థులకు మేలుచేసేలా వంచనా శిల్పాన్ని ఆవిష్కరించారని ధ్వజమెత్తారు. మాజీ కాగ్ వినోద్‌ రాయ్ పిల్లి కళ్ల‌ మూసుకుని ప్రపంచం అంతా చీకటిగా ఉన్నదన్నట్లు భ్రమించారని రాజా మండిప‌డ్డారు. కొత్త సంస్థలకు 2జీ స్పెక్ట్రం కేటాయింపుల ప్రక్రియను పూర్తిగా వివరించాకే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోదం తెలిపారని కేంద్ర టెలికం మాజీ మంత్రి ఏ రాజా పేర్కొన్నారు.

2జీపై మన్మోహన్‌ ను పీఎంవో ద్వారా ఆయన సలహాదారులు - టెలికం లాబీ తప్పుదోవ పట్టించారని రాజా ఆరోపించారు. నాటి ప్రధానిగా మన్మోహన్.. 2జీ స్పెక్ట్రం కేటాయింపులపై ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. టెలికం లాబీ ప్రయత్నాలు తాను ఆయన దృష్టికి తెచ్చినప్పుడు కలత చెందిన మన్మోహన్.. స్పెక్ట్రం కేటాయింపులు పూర్తిగా ప్రజలకు ఉపయోగ పడాలని ఆకాంక్షించారన్నారు. నాడు ఆయన సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఆయనకు మద్దతుగా నిలువక పోవడం తనకు వేదనను మిగిల్చిందన్నారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో అవకతవకల పేరిట సీబీఐ జరిపిన దాడుల సంగతి మన్మోహన్ సింగ్‌ కు ఏమాత్రం తెలియదన్నారు. 2009 అక్టోబర్ 22న (టెలికం అధికారులు - కొన్ని టెలికం సంస్థల కార్యాలయాలపై) సీబీఐ దాడులు చేసింది. నేను ఆ రోజు రాత్రి ఏడు గంటలకు పీఎంఓలో మన్మోహన్‌ సింగ్‌ తో సమావేశమయ్యా. సీబీఐ దాడులు జరిగాయని నేను చెప్పడంతో ప్రధాని ఆశ్చర్యపోయారు అని రాశారు. మంత్రిగా తన చర్యలను సమర్థించడానికే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మౌనం వహించారని రాజా తన పుస్తకంలో పేర్కొన్నారు.

విధాన పరమైన పొరపాట్లు జరిగాయని - ఆర్థిక దుర్వినియోగం జరిగిందన్న అభిప్రాయాలు కలిగించేందుకే మాజీ కాగ్ వినోద్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారన్నారు. కేంద్ర క్యాబినెట్ - ట్రాయ్ సిఫారసులు - టెలికం కమిషన్ సిఫారసులనూ గుడ్డిగా వ్యతిరేకిస్తూ విమర్శలు చేశారనన్నారు. కాగ్ నివేదికను ట్రాయ్ తోసిపుచ్చిన తర్వాత కూడా వినోద్‌ రాయ్ తన పొరపాట్లను సరిచేసుకునేందుకు సిద్ధం కాలేదని, ఆయన తన రాజ్యాంగ బాధ్యతలను అపహస్యం చేశారన్నారు. 2జీపై అప్పటి మంత్రి పీ చిదంబరం తనతో చర్చించడానికి ఇష్టపడక పోవడం ఇప్పటికీ తనకు చిక్కుముడిగానే ఉన్నదన్నారు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి మద్దతు లేనందున తానేమీ చేయలేనని మాజీ సొలిసిటర్ జనరల్ జీఈ వాహనవతి ఒకదశలో చేతులేత్తేశారని ఏ రాజా తెలిపారు. తన స్నేహితుడు - నాటి మంత్రి పీ చిదంబరం తనయుడు కార్తి చిదంబరం ద్వారా 2007 సెప్టెంబర్‌ లో సంప్రదింపుల కోసం ఎయిర్‌ టెల్ అధినేత సునీల్ మిట్టల్ కబురు చేశారని రాజా గుర్తు చేశారు. టెలికం రంగంలోనూ - రాజకీయ రంగంలోనూ తన పలుకుబడితో సునీల్ మిట్టల్ తనను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అంతకుముందు టెలికం మంత్రుల మాదిరిగానే తన నుంచి సహకారం అందుతుందని అంచనా వేశారని రాజా చెప్పారు.