Begin typing your search above and press return to search.

విదేశాల్లో సెటిల‌వుతున్న మ‌న కోటీశ్వ‌రులు

By:  Tupaki Desk   |   23 Feb 2017 7:59 AM GMT
విదేశాల్లో సెటిల‌వుతున్న మ‌న కోటీశ్వ‌రులు
X
భారత్ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఇత‌ర వృత్తి నిపుణులు మాత్రమే విదేశాలకు వలస పోతారని అనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. విదేశీ బాట పట్టే కోటీశ్వరులు కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉన్నారు. గత ఏడాది భారత్ నుంచి 6వేల మంది అపరకుబేరులు పరసీమలకు తరలిపోయారని న్యూవరల్డ్ వెల్త్ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. 2015లో ఇలా వలస వెళ్లిన సంపన్నుల సంఖ్య 4 వేల వరకు ఉన్నట్టు సంస్థ తెలిపింది. గ‌త ఏడాది దాదాపు 82 వేల మంది మిలియనీర్లు విదేశాలకు వలస వెళ్లిపోయారని ఈ సంస్థ‌ నివేదిక చెబుతోంది. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 64 వేలుగా ఉందని ఆ నివేదిక అంటోంది. 2016లో ఆస్ట్రేలియాకు 11 వేల మిలియనీర్లు వలస వెళ్లారని అంచనా. అమెరికాకు 10 వేల మంది, బ్రిటన్‌ కు 3 వేల మంది వలస వెళ్లారు. కెనడా, యుఎఇ - న్యూజీలాండ్ - ఇజ్రాయెల్‌ కూ వలసలు పెరిగాయని సదరు నివేదిక చెబుతోంది.

గ్లోబల్ వెల్త్ అండ్ వెల్త్ ఇమ్మిగ్రేషన్‌ పై న్యూ వరల్డ్ వెల్త్ తాజా నివేదిక ప్రకారం భారత్‌లో ప్రజల దగ్గర 6.2 లక్షల కోట్ల డాలర్ల (రూ.4.15 కోట్ల కోట్లు) సంపద ఉంది. మిలియనీర్లు...అంటే రూ.6.7 కోట్ల పైచిలుకు ఆస్తి కలిగినవారు 2,64,000 మంది ఉండగా బిలియనీర్లు.. అంటే రూ.6700 కోట్ల పైచిలుకు ఆస్తి కలిగినవారు 95 మంది వరకు ఉన్నారు. సంపన్నులు స్థిరపడేందుకు ఎంచుకుంటున్న దేశాల్లో ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/