Begin typing your search above and press return to search.

`సుక్మా`లో ఎన్ కౌంట‌ర్..42 మంది మావోల మృతి!

By:  Tupaki Desk   |   26 April 2018 11:22 AM GMT
`సుక్మా`లో ఎన్ కౌంట‌ర్..42 మంది మావోల మృతి!
X
మహారాష్ట్ర-ఛత్తీస్‌ గఢ్‌ సరిహద్దులో మావోయిస్టుల‌కు - పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగిన భారీ ఎన్‌ కౌంటర్ దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్ కౌంట‌ర్ లో చ‌నిపోయిన వారి సంఖ్య తాజాగా 42కు చేరింది. ఇంద్రావ‌తిన‌దిలో తాజాగా 2 మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. న‌దిలో మ‌రిన్ని మృత‌దేహాలు ల‌భించే అవ‌కాశ‌ముంద‌ని పోలీసు అధికారులు భావిస్తున్నారు. అంత‌కు ముందు ఇంద్రావ‌తి నది నుంచి 15 మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. తప్పించుకునే మార్గం లేక‌పోవ‌డంతో ఇంద్రావ‌తి నది తీర ప్రాంతంలో మావోయిస్టులు గుడారాలు వేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హ‌ఠాత్తుగా పోలీసులు న‌దిని స‌మీపించ‌డంతో చాలామంది న‌దిలోకి దూకిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే, న‌దిలో మొసళ్లు - చేపలు పీక్కుతినటంతో బ‌య‌ట‌ప‌డ్డ మృతదేహాలను గుర్తుప‌ట్ట‌డం క‌ష్టంగా మారింద‌ని పోలీసులు చెప్పారు. అయితే, మృతుల్లో పౌరులు లేర‌ని స్ప‌ష్టం చేశారు. ఇంద్రావతి నది పరిసర ప్రాంతాల్లో కూంబింగ్‌ కొనసాగిస్తామ‌ని - మ‌రిన్ని మృతదేహాలు బయటపడే అవ‌కాశ‌ముంద‌ని పోలీసు అధికారులు చెప్పారు.

మ‌ర‌వైపు, ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో శనివారం నాడు సీఆర్పీఎఫ్‌ ఏఎస్సై ఒకరు మావోయిస్టుల దాడిలో చ‌నిపోయారు. దీంతో, భారీ కూంబింగ్‌ ఆపరేషన్ ను చేపట్టారు. ఛత్తీస్‌ గఢ్‌ - మహారాష్ట్ర - సీఆర్పీఎఫ్‌ - కోబ్రా బలగాలు సంయుక్తంగా అడవిని జల్లెడపట్టాయి. ఈ నేప‌థ్యంలోనే గ‌డ్చిరోలి లోని ఏటపల్లి ద‌గ్గ‌ర శనివారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆ త‌ర్వాత ఆదివారం రాత్రి సుక్మా జిల్లాలో ఐదుగురు, రాజారాం ఖాండ్లా అడవి(గడ్చిరోలి)లోని జిమాల్‌ గట్ట ప్రాంతంలో నలుగురు మృతి చెందారు. తాజాగా, మంగళవారం ఉదయం గడ్చిరోలి జిల్లా ఇంద్రావతి నదీ తీరంలో 15 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఓ వైపు కూంబింగ్ తోపాటు న‌దిలో మ‌రిన్నిమృత‌దేహాల‌ను గుర్తించేందుకు పోలీసులు ముమ్మ‌రంగా గాలిస్తున్నారు.