Begin typing your search above and press return to search.

బ్రిటన్‌ లో 38 మంది భారతీయుల నిర్బంధం

By:  Tupaki Desk   |   24 April 2017 4:31 AM GMT
బ్రిటన్‌ లో 38 మంది భారతీయుల నిర్బంధం
X
వీసా నిబంధనలు ఉల్లంఘించి బ్రిటన్‌ లో ఉంటున్న భారత్‌ కు చెందిన 38 మందిని అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో తొమ్మిది మంది మహిళలు కూడా ఉన్నారు. గతవారం లీసెస్టర్‌ లోని రెండు వస్త్ర పరిశ్రమలపై అధికారులు దాడులు చేశారు. అక్కడ వీసా గడువు ముగిసిన లేదా అక్రమంగా పనులు చేస్తున్న 38 మంది భారతీయులను - ఆఫ్ఘనిస్థాన్‌ కు చెందిన ఒకరిని పట్టుకున్నారు. వీరిలో 20 మందిని మాత్రం రోజూ హోం కార్యాలయానికి రావాలని షరతులు విధించి తరువాత విడిచిపెట్టారు.

తూర్పు మిడ్‌ లాండ్స్‌ ప్రాంతంలో ఉన్న ఎంకె క్లాతింగ్‌ లిమిటెడ్‌ - ఫ్యాషన్‌ టైమ్స్‌ యుకె లిమిటెడ్‌ అనే వస్త్ర సంస్థలపై అధికారులు దాడి చేసి అక్కడ పనిచేస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 31 మంది వీసాల గడువు ముగిసిందని, ఏడుగురు దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని, ఒకరు వీసా నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు వెల్లడించారు. 32 మందిలో 19 మందిని బ్రిటన్‌ నుంచి వెనక్కి పంపించే సూచనలున్నాయి. మిగిలినవారిని ప్రతిరోజూ ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయంలో రిపోర్టు చెయ్యాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ''మా బృందం జరిపిన అతిపెద్ద దాడి ఇది. అక్రమ వలసవాసులు పనిచేస్తున్న సంస్థలు పన్ను ఎగ్గొడతాయి. ఇక్కడవారి ఉద్యోగావ కాశాలకు వారు గండికొడతారు'' అని ఇమ్మిగ్రేషన్‌ అధికారి ఒకరు చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/