Begin typing your search above and press return to search.

యోగి ఇలాకాలో ఎంత ఘోరం !?

By:  Tupaki Desk   |   11 Aug 2017 4:50 PM GMT
యోగి ఇలాకాలో ఎంత ఘోరం !?
X
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలో 30 మంది చిన్నారులు అన్యాయంగా బలైపోయారు. ప్రాణ వాయువు అందక గిలగిలలాడుతూ అనంతవాయువుల్లో కలిసిపోయారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం అనే భారత రాష్ర్ట ప్రభుత్వాల అలవాటు వల్ల అభంశుభం తెలియని 30 మది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తరప్రదేశ్‌ మఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గోర‌ఖ్ పూర్‌లోని బీడీఎస్ ఆసుప‌త్రిలో మెదడు వాపు వ్యాధితో చాలామంది చిన్నారులు చేరారు. అయితే ... అలా చికిత్స తీసుకుంటున్న చిన్నారుల్లో 30 మంది మృతి చెందారు. వారంతా వ్యాధి ముదరడంతో చనిపోయారని అంతా భావించారు. కానీ... అసలు విషయం ఆలస్యంగా తెలిసింది. ఆక్సిజన్‌ అందకే వారంతా చ‌నిపోయిన‌ట్లు తేలింది. ఆ హాస్పిటల్ కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫరా చేస్తున్న కంపెనీకి ఆ ఆసుప‌త్రి రూ.66 లక్షల బాకీ ఉంది. ఆ బిల్లు చెల్లించ‌డంలో ఆలస్యం చేస్తుండ‌డంతో ఆ కంపెనీ ఆసుప‌త్రికి ఆక్సిజన్‌ పంపిణీని నిలిపివేసింది.

దీంతో ఏకంగా 30 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అదే ఆసుప‌త్రిలో మరో 45 మంది చిన్నారులు వెంటిలేషన్‌పై ఉన్నారని స‌మాచారం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజక వర్గంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో విపక్షాలకు నోటినిండా పని దొరికింది.