Begin typing your search above and press return to search.

మోడీకి షాక్‌..రైతులు భూములు స్వాధీనం

By:  Tupaki Desk   |   18 March 2018 10:01 AM GMT
మోడీకి షాక్‌..రైతులు భూములు స్వాధీనం
X
మ‌హారాష్ట్రలోని రైతుల చైత‌న్యం ఇటీవ‌ల జ‌రిగిన లాంగ్ మార్చ్‌ తో దేశ‌వ్యాప్తంగా సుప‌రిచితం అయిన సంగ‌తి తెలిసిందే. అలా అంద‌రి చూపును త‌మ‌వైపు తిప్పుకున్న మ‌రాఠా అన్న‌దాత‌లు మ‌రో రూపంలో ప‌తాక శీర్షిక‌ల‌కు ఎక్కారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌ బీ)కు దాదాపు రూ.12 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీకి ఊహించని షాక్ ఇచ్చారు. మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌ జిల్లాలో ఆయన కంపెనీ పేరిట ఉన్న 250 ఎకరాల భూమిని రైతులు స్వాధీనం చేసుకున్నారు.

అహ్మద్‌ నగర్‌ లోని ఖండాలా ప్రాంతానికి దాదాపు 200 మంది రైతులు ఎడ్ల బండ్లపై శనివారం చేరుకున్నారు. అక్కడ నీరవ్‌ పేరిట ఉన్న భూమిని ట్రాక్టర్‌ తో దున్నారు. ఈ భూమినంతా సాగు చేయనున్నట్టు రైతులు తెలిపారు. తమను బెదిరించి అతి తక్కువ ధరకే ఈ భూమిని నీరవ్‌ సొంతం చేసుకున్నాడని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఎకరా రూ.20 లక్షలు ధర పలికే భూమిని నీరవ్‌ కేవలం రూ.15 వేలకే సొంతం చేసుకున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. పీఎన్‌బీ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అటాచ్‌ చేసిన ఆస్తుల్లో ఈ భూమి కూడా ఉండటం గమనార్హం.

ఇదిలాఉండ‌గా..పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌ బీ) కుంభకోణంలో అరెస్టయిన 11 మంది నిందితులను ఈ నెల 28వ తేదీ వరకూ జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తున్నట్లు ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. అరెస్ట‌యిన వారిలో మెజార్టీ బ్యాంక్ ఉద్యోగులు ఉండ‌టం విశేషం. ఈ కేసులో కీలక నిందితులైన గోకుల్‌ నాథ్ షెట్టి (పీఎన్‌ బీ మాజీ డిప్యూటీ జీఎం) - మనోజ్ ఖరత్ (పీఎన్‌ బీ సింగిల్ విండో ఆపరేటర్) - హేమంత్ భట్ (ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కంపెనీ అధీకృత సంతకందారు) - బెచ్చూ తివారీ (అప్పటి పీఎన్‌ బీ ఫోరెక్స్ విభాగ చీఫ్ మేనేజర్)తో పాటు యశ్వంత్ జోషి (పీఎన్‌ బీ ఫోరెక్స్ విభాగ స్కేల్-2 మేనేజర్) - ప్రఫుల్ సావంత్ (ఎగుమతుల సెక్షన్‌ లో స్కేల్-1 ఆఫీసర్) ఉన్నారు.