Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ లో తెలుగు మెడికోలు మృతి

By:  Tupaki Desk   |   20 Sep 2017 7:46 AM GMT
ఉక్రెయిన్ లో తెలుగు మెడికోలు మృతి
X
అప్ప‌టివ‌ర‌కూ స‌ర‌దా.. స‌ర‌దాగా సాగిన కాలం ఒక్క‌సారిగా మారిపోయింది. అంతులేని విషాదాన్ని మిగిల్చిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అప్ప‌టివ‌ర‌కూ హుషారుగా త‌మ క‌ళ్ల ముందు తిరిగిన ఇద్ద‌రు.. తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోవ‌టం శోకంగా మారింది. ఉక్రెయిన్ లో వైద్య విద్య‌ను అభ్య‌సిస్తున్న ఇద్ద‌రు తెలుగు మెడికోలు ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించారు.

హైద‌రాబాద్‌లోని కుంట్లూరుకు చెందిన శివ‌కాంత్ రెడ్డి.. క‌డ‌ప‌కు చెందిన ఎం. అశోక్ కుమార్ లు ఉక్రెయిన్ లోని జూపోరోజియా స్టేట్ మెడిక‌ల్ వ‌ర్సిటీలో ఎంబీబీఎస్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్నారు. స్నేహితుల‌తో క‌లిసి ఈ ఇద్ద‌రు తెలుగు మెడికోలు బీచ్ లో వాలీబాల్ ఆడుతున్నారు.

వాలీబాల్ స‌ముద్రంలో ప‌డ‌టం.. దాన్ని తీసుకురావ‌టానికి వెళ్లిన ముఖేశ్ అనే మిత్రుడ్ని రాకాసి అల‌లు స‌ముద్రంలోకి లాక్కెళ్లాయి. అత‌న్ని ర‌క్షించేందుకు శ్రీకాంత్ రెడ్డి.. అశోక్ కుమారులు స‌ముద్రంలోకి వెళ్లారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు వారిరువురు స‌ముద్రంలోకి కొట్టుకుపోయారు. ఈ వార్త విన్న ఇద్ద‌రి త‌ల్లిదండ్రులు శోకసంద్రంలోకి మునిగిపోయారు. ఈ నెల ఒక‌టో తేదీన సెల‌వులు ముగించుకొని ఉక్రెయిన్‌కు వెళ్లార‌ని.. ఇక ఎప్ప‌టికి తిరిగిరాక‌పోవ‌టాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ ఉదంతం విన్న వారంతా తీవ్ర విషాదానికి గురి అవుతున్నారు.