Begin typing your search above and press return to search.

పైశాచికం: కత్తితో సైకో వీరంగం-19 మంది మృతి

By:  Tupaki Desk   |   26 July 2016 4:23 AM GMT
పైశాచికం: కత్తితో సైకో వీరంగం-19 మంది మృతి
X
జపాన్ లో దారుణం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని టోక్యోకు చెందిన 20 ఏళ్ల జపాన్ యువకుడు సైకోలా వ్యవహరించి దారుణానికి పాల్పడ్డాడు. అత్యంత కిరాతకంగా వ్యవహరించిన ఆ యువకుడు నల్లటి దుస్తులు ధరించి.. వికలాంగులకు కేటాయించిన ఆశ్రమంలోకి ప్రవేశించి.. కత్తితో 19 మందిని అత్యంత దారుణంగా పొడిచి చంపేశాడు.

భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ గుర్తు తెలియని యువకుడు చేసిన అకృత్యానికి అమాయకులైన 19 మంది వికలాంగులు మరణించారు. జపాన్ స్థానిక మీడియా కథనం ప్రకారం.. సైకో చేసిన దాడిలో19 మంది మృతి చెందారని.. 50 మందికి పైగా గాయపడ్డారని.. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న జపాన్ పోలీసులు రంగంలోకి దిగి.. గుర్తు తెలియని సదరు యువకుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ అతడు ఎవరు? కత్తితో అంత దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు? అతని మానసిక పరిస్థితి సరిగా లేదా? లాంటి ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.