Begin typing your search above and press return to search.

2019 జ‌గ‌న్‌ దే!... 135 సీట్లు ఖాయ‌మేన‌ట‌!

By:  Tupaki Desk   |   18 March 2018 10:09 AM GMT
2019 జ‌గ‌న్‌ దే!... 135 సీట్లు ఖాయ‌మేన‌ట‌!
X
ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఏపీలో విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి... గుంటూరు జిల్లా కాకుమానులో పంచాంగ శ్ర‌వ‌ణం విన్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట మూడున్న‌ర నెల‌ల క్రితం జగ‌న్ మొద‌లుపెట్టిన సుదీర్ఘ పాద‌యాత్ర ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని నేటి పాద‌యాత్ర‌కు విరామం ప‌లికిన జ‌గ‌న్‌... నిన్న త‌న యాత్ర ఆగిన చోటే ప్ర‌త్యేకంగా ఉగాది వేడుక‌ల‌ను జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా 40 మంది వేద పండితుల‌తో కూడిన బృందం పంచాంగ శ్ర‌వ‌ణం వినిపించింది. తెలుగు ద‌నం ఉట్టిప‌డేలా సంప్ర‌దాయబ‌ద్ధంగా పంచెక‌ట్టులో వేడుక‌ల‌కు హాజ‌రైన జ‌గ‌న్‌... పార్టీ నేత‌ల‌తో క‌లిసి పంచాంగ శ్ర‌వ‌ణాన్ని ఆల‌కించారు. ఏటా ఉగాది ప‌ర్వ దినాన పంచాంగ శ్ర‌వ‌ణం స‌ర్వ‌సాధార‌ణ‌మే అయినా... ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ ఈ ఏడాదికి సంబంధించిన పంచాంగ శ్ర‌వ‌ణానికి ప్ర‌త్యేక‌త ఉంద‌నే చెప్పాలి.

ఈ లెక్క‌న కాకుమానులో వైసీపీ ఏర్పాటు చేసిన వేదిక మీద 40 మంది వేద పండితులు ఒక్క మాట‌పై నిలిచి వినిపించిన పంచాంగం నిజంగానే ఆస‌క్తి రేకెత్తిస్తోంది. మ‌హానేత‌గా జ‌నాల మ‌దిలో చిర స్థానాన్ని సంపాదించుకున్న దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఉమ్మ‌డి రాష్ట్రంలో అందించిన సుప‌రిపాల‌న న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌ళ్లీ వ‌చ్చేస్తుంద‌ని పండితులు చెప్పారు. అంతేకాకుండా వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం త‌థ్య‌మ‌ని, ప్ర‌జ‌ల ఆశీర్వాదాల‌తోనే జగ‌న్ సీఎం అవుతార‌ని కూడా వారు చెప్పారు. ఈ పంచాంగ శ్ర‌వ‌ణంలో వేద పండితులు చెప్పిన పూర్తి వివ‌రాల్లోకి వెళితే... అక్టోబ‌ర్ నాటికి జ‌గ‌న్ స‌మ‌స్య‌ల‌న్నీ తీరిపోతాయ‌ని, అక్టోబ‌ర్ త‌ర్వాత అంతా జ‌గ‌న్‌కు అనుకూలంగానే జ‌రుగుతుంద‌ట‌. అక్టోబర్ 25 వరకు జ‌గ‌న్‌ జాతకంలో ఉన్న గోచార సమస్యలు పూర్తవుతాయట‌. జగన్ కీర్తి ఆ తర్వాత మరింత పెరుగుతుందన్నారు. అక్టోబ‌ర్ త‌ర్వాత జ‌గ‌న్‌కు రాజ‌యోగం ప‌డుతుంద‌ట‌. 2019లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీకి ఏకంగా 135 అసెంబ్లీ సీట్ల‌లో విజ‌యం ద‌క్కుతుంద‌ని, ఫ‌లితంగా జ‌గ‌న్ సీఎం కావ‌డం ఖాయ‌మేనని పండితులు తేల్చేశారు.

జ‌గ‌న్ ఏకంగా 12 ఏళ్ల‌కు పైగా సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తార‌ని కూడా పండితులు పేర్కొన్నారు. జ‌గ‌న్ పాల‌న ఎంత‌కాలం కొన‌సాగుతుంద‌న్న విష‌యంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పండితులు... జ‌గ‌న్ 12 ఏళ్ల 8 నెలల 18 రోజులు అధికారంలో ఉంటారని తెలిపారు. జగన్‌కు, రాష్ట్రానికి మంచి జరుగాలనే ఉద్దేశంతో సహస్త్రచండీయాగం తలపెట్టామని, రెండేళ్లపాటు యాగం నిర్వహిస్తామని, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక జగన్‌ పూర్ణాహుతి కోసం వస్తారని స్వాములు శుభం పలికారు. ఇక ఈ పంచాంగ శ్ర‌వ‌ణంపై పండితులు చాలా ధీమా వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ సీఎం అవుతార‌ని తామేదో ముఖస్తుతి కోసం చెప్పడం లేదని, తాము చెప్పినవి తప్పయితే జీవితంలో పంచాంగ శ్రవణం చేయబోనని సవాల్ చేశారు. తాము 40 మంది పంచాంగకర్తలం కలిసి కూర్చొని భవిష్యత్తును అంచనా వేశామని, ఈ అంచనాలు ఏకాభిప్రాయమని వారు ముక్త‌కంఠంతో చెప్పారు.