Begin typing your search above and press return to search.

ఇన్ఫోసిస్‌ లో 11వేల ఉద్యోగాలు ఔట్‌

By:  Tupaki Desk   |   25 Jun 2017 9:49 AM GMT
ఇన్ఫోసిస్‌ లో 11వేల ఉద్యోగాలు ఔట్‌
X
భార‌త‌దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ మ‌రో దుర్వార్త‌ను తెలియ‌జెప్పింది. 11,000 మంది ఉద్యోగులకు ఇన్ఫోసిస్ ఉద్వాసన పలికింది. కృత్రిమ మేథ - ఆటోమేషన్‌ వంటి అధునాతన టెక్నాలజీలను అందుబాటులోకి తేవడం కారణంగా ఏడాది కాలంలో వీరిని బయటికి పంపేసినట్టుగా ఇన్ఫోసిస్‌ తెలిపింది. బెంగళూరులో జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆటోమేషన్‌ - యుటిలైజేషన్‌ - ప్రొడక్టివిటీ మెరుగుదలతో పూర్తిస్థాయి ఉద్యోగి ఆదాయం 1.2 శాతం మేర పెరిగినట్టు తెలిపింది.

కాగా వ్యవస్థాపకులకు - మేనేజ్‌ మెంట్‌ కు మధ్య విభేదాలు వార్షిక వాటాదారుల సాధారణ సమావేశం (ఎజిఎంకు) సాక్షిగా వెలుగులోకి వచ్చాయి. సంస్థ ఇక్కడ ఏర్పాటు చేసిన ఎజిఎంకు ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు - ప్రమోటర్లు మూకుమ్మడిగా డుమ్మా కొట్టారు. ప్రధానంగా సంస్థ వ్యవస్థాపక‌ ఛైర్మన్‌ నారాయణ మూర్తి కూడా ఈ సమావేశానికి గైర్హాజరవడం విశేషం. తాజా పరిణామంతో వ్యవస్థాపకులు సంస్థలోని తమ వాటాను విక్రయించి ఇన్ఫోసిస్‌ ను నుంచి వైదొలగాలని యోచిస్తున్నట్టు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది.

మ‌రోవైపు వ్యవస్థాపకులతో తమకు ఎలాంటి విభేదాలు లేవని ఇన్ఫోసిస్‌ యాజమాన్యం ప్రకటనలు చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. 1981లో నారాయణ మూర్తితో పాటు నందన్‌ నిలేకని - ఎస్‌.గోపాల్‌ క్రిష్ణన్‌ - ఎస్‌.డి. శిబులాల్‌ - ఎన్‌.ఎస్‌.రాఘవన్‌ - కే.దినేష్‌ - అశోక్‌ అరోరాలు కంపెనీ స్థాపించారు. అనంతరం 1993 నుంచి సంస్థ స్టాక్‌ మార్కెట్ లోకి వచ్చింది. అప్పటి నుంచి ఒక్క వ్యవస్థాపకుడు గానీ.. ప్రమోటర్‌ గానీ లేకుండా ఏజీఎం జరగడం ఇదే తొలిసారని ఇన్వెస్ట‌ర్లు వాపోతున్నారు. కంపెనీ స్థాపించిన నాటి నుంచి ఇన్ఫోసిస్‌ కు ఆత్మగా.. ఇంజిన్‌ గా కొనసాగుతూ వస్తున్న వ్యవస్థాపకులు ఏజీఎంకు రాకుండా ఉండడం వాటాదారుల్లోనూ కొత్త అనుమానాలకు దారి తీసింది. గత ఏడాది ఏజీఎంకు నారాయణమూర్తి తన కొడుకు రోహన్‌ మూర్తితో కలిసి హాజరయ్యారు. మూర్తి రాకపోవడం, సహా వ్యవస్థాపకులు కనిపించకపోవడం చాలా మంది ఇన్వెస్టర్లకు ఆశ్చర్యకరంగా తోచింది. అయితే సహ వ్యవస్థాపకులు ఈ భేటీకి ఎందుకు రాలేదు తమకు తెలియదని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పడం గమనార్హం.

ఇదిలాఉండ‌గా...ప్రమోటర్లకు - కంపెనీ బోర్డుకు ఎలాంటి విబాధాలు గానీ, సమస్యలు గానీ లేవని సంస్థ మరోమారు పేర్కొంది. సంస్థలో ఉన్నతస్థాయి ఉద్యోగులు, సాధారణ ఉద్యోగులకు మధ్య వేతనాల వ్యత్యాసం విషయంలో తమకు పూర్తి అవగాహన ఉందని ఆ కంపెనీ ఉన్నతాధికారి ఒక్కరు పేర్కొన్నారు. వేతనాలకు సంబంధించి తమకు మంచి అవగాహన ఉందన్న ఆయన వేతనాల అంతరాన్ని తగ్గిస్తామన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/