Begin typing your search above and press return to search.

శ‌భాష్ కేటీఆర్‌

By:  Tupaki Desk   |   27 Aug 2015 4:14 AM GMT
శ‌భాష్ కేటీఆర్‌
X
తెలంగాణ రాష్ర్ట పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చేనేత కార్మికుల‌పై మ‌మ‌కారాన్ని చాటుకున్నారు. తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలోని చేనేత, మరమగ్గాల కార్మికులకు రక్షాబంధన్ కానుక ప్రకటించారు. చేనేత కార్మికులందరికి భరోసా కల్పించేందుకు సురక్షా బీమా యోజన కింద ప్రమాద బీమా కల్పించనున్నారు. నియోజకవర్గంలోని ప్రతి కార్మికుడికి రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం లభిస్తుంది. ప్రమాద బీమా ప్రీమియం మొత్తం మంత్రి కేటీఆర్ సొంతంగా చెల్లిస్తారు. రక్షా బంధన్ నాటికి సిరిసిల్లలోని ప్రతి కార్మికుడికి బీమా సౌకర్యం అందేవిధంగా తక్షణం చర్యలు తీసుకోవాలని మంత్రి బుధవారం అధికారులను ఆదేశించారు.

ఈ పథకం ద్వారా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 25 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. 18 - 70 ఏళ్ల‌ మధ్య వయస్కులు ఈ బీమాయోజనకు అర్హులు. ఈ పథకం అమలుతో కార్మికులకు రూ.2 లక్షల ప్రమాద బీమాతోపాటు శాశ్వత అంగ వైకల్య బీమా లభిస్తుంది. పాక్షిక అంగ వైకల్యానికి గురైన వారికి రూ. లక్ష వరకు లబ్ధి చేకూరనున్నది. కేటీఆర్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన అధికారులు ఇప్పటికే 20 వేల మంది లబ్ధిదారులను గుర్తించారు. నియోజకవర్గ పరిధిలోని బ్యాంకర్లతోనూ సమావేశమయ్యారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ చేనేత కార్మికుల‌కు గుర్తింపు జాతీయ దినోత్స‌వాన్ని ప్ర‌క‌టిస్తే...కేటీఆర్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని కార్మికులంద‌రికీ మేలు చేయ‌డం అభినంద‌నీయ‌మే.