Begin typing your search above and press return to search.

చెట్టుపై ఇరుక్కుపోయిన కారు... యూఎస్ లో ముగ్గురు ఇండియన్స్ మృతి!

అవును... అమెరికాలోని సౌత్‌ కరోలినాలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By:  Tupaki Desk   |   27 April 2024 11:24 AM GMT
చెట్టుపై ఇరుక్కుపోయిన కారు... యూఎస్  లో ముగ్గురు ఇండియన్స్  మృతి!
X

అమెరికాలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందుతున్న భారతీయులు, భారత సంతతి వ్యక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే! కారణం ఏదైనా, కారకులు ఎవరైనా.. ఈ తరహా వార్తలు దాదాపు ప్రతీరోజూ ఏదో ఒక మూల దర్శనమిస్తున్నాయి. ఈ సమయంలో తాజాగా అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా ముగ్గురు భారతీయులు మృతి చెందారు.

అవును... అమెరికాలోని సౌత్‌ కరోలినాలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో... ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం పాలవ్వగా.. ఒక వ్యక్తి గాయపడినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఒక వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఇక మృతులంతా గుజరాత్‌ లోని ఆనంద్ జిల్లాకు చెందిన వారని స్థానిక అధికారులు తెలిపారు.

వారి పేర్లు సంగీతాబెన్ పటేల్, రేఖాబెన్ పటేల్‌, మనీశాబెన్ పటేల్ అని వెల్లడించారు. వారు ప్రయాణిస్తున్న కారు పరిమితికి మించిన వేగంతో ప్రయాణించినట్లు తెలుస్తోందని.. ఇంత వేగంతో ప్రయాణించడం చాలా అరుదుగా చూస్తామని అధికారులు చెబుతున్నారు. ఆ మితిమీరిన వేగం కారణంగానే వారు ప్రయాణిస్తున్న ఆ ఎస్‌.యూ.వీ.. రహదారిపై 4 - 6 వరుసలు పల్టీ కొడుతూ చెట్లపైకి ఎగిరిపడి, ఇరుక్కుపోయిందని తెలిపారు.

ఆ సమయంలో గాల్లోకి సుమారు 20 అడుగుల ఎత్తుకు లేచినట్లు తెలుస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో... సమాచారం అందుకున్న అనంతరం సౌత్ కరోలినా హైవే పెట్రోల్, గాంట్ ఫైర్ అండ్ రెస్క్యూ, బహుళ గ్రీన్‌ విల్లే కౌంటీ ఈ.ఎం.ఎస్. యూనిట్‌ లతో సహా అత్యవసర ప్రతిస్పందన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.