Begin typing your search above and press return to search.

మొగుడ్స్‌ పెళ్లామ్స్‌ బిస్కెట్లే బిస్కెట్లు

By:  Tupaki Desk   |   29 Jun 2015 5:59 AM GMT
మొగుడ్స్‌ పెళ్లామ్స్‌ బిస్కెట్లే బిస్కెట్లు
X
మొన్నటిరోజున ఫిలింఫేర్‌ సౌత్‌ ఉత్సవాలు చెన్నయ్‌లో ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకల్లో ఓ విషయం మాత్రం బాగా హైలైట్‌ అయ్యింది. కార్యక్రమం ఆద్యంతం విసిగించేంత శోధితో నడిచింది. దీనిపై చాలామంది తమ అసంతృప్తిని వెల్లగక్కారు. ఎప్పుడో సాయంత్రం మొదలైన ఈ వేడుక మిడ్‌ నైట్‌ అయితే కానీ పూర్తవ్వలేదు. అంతసేపు అతిధులు వేచి చూడలేక చచ్చారు. కొందరైతే వేదిక ఎక్కి నేరుగా తమ అసహనాన్ని వెల్లగక్కారు.

ఈ వేడుకల్లో యాంకర్లిద్దరూ బుర్ర తినేశారని విసుక్కున్నారు కొందరు. అందులో స్టార్‌ హీరో కం ఫిలింమేకర్‌ శరత్‌కుమార్‌ కూడా ఉన్నారు. ఫిలింఫేర్‌ ఉత్సవాలకు మొగుడ్స్‌ పెళ్లామ్స్‌ చిన్మయి-రాహుల్‌ రవీంద్రన్‌ జంట యాంకరింగ్‌ చేశారు. ఈ ఉత్సవాల టైటిల్‌ స్పాన్సర్స్‌ అయిన బ్రిటానియా బిస్కెట్స్‌ని ప్రమోట్‌ చేసే పనిలో ఇలా బుర్ర తిన్నారు ఇద్దరూ. ఓ వైపు బిస్కెట్లు తింటూనే యాంకరింగ్‌ కొనసాగించారు. దాంతో ఇదేం సుత్తిరా బాబూ అనుకోవడం అతిధుల వంతయ్యింది. శరత్‌కుమార్‌ అవార్డు అందుకునే వేళ వేదికపైకి వచ్చి 'మీ దగ్గర చాలా బిస్కెట్లు ఉన్నాయి' బాబోయ్‌ అన్నంత పనిచేశాడు. అంతకంటే ముందే బ్రహ్మాజీ కూడా ఇదే టైపులో సెటైర్‌ వేశాడు.

'ఆ బిస్కెట్లు మాక్కూడా పెట్టి ఉంటే చాలా బావుండేది' అంటూ జోకేశాడు. ఇదంతా చూస్తున్న అహూతులకు భలే పంచ్‌ వేశారే అనిపించింది. అయితే ప్రతి వినోద కార్యక్రమాన్ని స్పాన్సర్లకు ఇవ్వడం వల్ల తలెత్తే దుష్పరిణామమిది. శోధితో, నసతో ఎదుటివారిని చంపేసి అయినా తమ ఉత్పత్తికి ప్రచారం చేసుకోవాలన్న ఆత్రం నుంచి పుట్టిన కార్యక్రమం ఇలాగే సాగుతుందన్నమాట! యాంకర్ల అతితో అది మరీ పరాకాష్టకు వెళుతుంది కూడా.