Begin typing your search above and press return to search.

తన నియోజకవర్గంలో ఎన్నికలపై ఈ నేత ఆరాటం!

By:  Tupaki Desk   |   30 Jun 2015 6:01 AM GMT
తన నియోజకవర్గంలో ఎన్నికలపై ఈ నేత ఆరాటం!
X
గవర్నర్‌ను మోసం చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలసాని శ్రీనివాసయాదవ్‌ను క్యాబినెట్‌లో చేర్చుకొన్నాడని అంటున్నాడు మర్రిశశిధర్‌ రెడ్డి. తలసాని గెలిచింది టీడీపీ తరపున అయినా.. ఆయన తెరాస తరపున గెలిచాడని అంటూ కేసీఆర్‌ గవర్నర్‌కు చెప్పాడని మర్రి వ్యాఖ్యానించాడు. ఈ విధంగా మోసం చేసి తలసానిని కేసీఆర్‌ తన మంత్రివర్గంలోకి తీసుకొన్నాడని మర్రి అన్నాడు. ఇది దారుణం అని.. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే మంత్రిపదవిలో ఎలా ఉంటాడని మర్రి ప్రశ్నిస్తున్నాడు.
తక్షణం తలసాని పై చర్యలు తీసుకోవాలని.. ఆయనపై అనర్హత వేటు వేయాలని.. మర్రి డిమాండ్‌ చేశాడు. మరి కాంగ్రెస్‌ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలే గేటు దాటినా మర్రి మాత్రం తలసాని గురించే మాట్లాడుతున్నాడు. ఆయనపై వేటు వేయాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాడు.
ఇక్కడ మర్రి వ్యక్తిగత స్వార్థం కూడా కొంత ఉందనే చెప్పాలి. అదెలాగంటే.. ఒకవేళ తలసానిపై వేటు పడితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్‌ నగర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయి. కాంగ్రెస్‌ తరపు నుంచి ఈ సీటు మర్రి కే చెందుతుంది.
అంటే సనత్‌నగర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే మర్రి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని సంపాదించుకోవచ్చు. ఈ ఆశతోనే ఆయన ఈ మధ్య తరచూ తలసానిపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్‌ను చేస్తున్నాడనుకోవాలి. మరి ఈయన డిమాండ్‌కు స్పందించేది ఎవరు?