Begin typing your search above and press return to search.

వెంకయ్య బోల్డన్ని కొత్త విషయాలు చెప్పారు!

By:  Tupaki Desk   |   25 May 2015 12:45 PM GMT
వెంకయ్య బోల్డన్ని కొత్త విషయాలు చెప్పారు!
X
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎవరికీ తెలియని ఒక కొత్త విషయం చెప్పారు. అదేమిటంటారా!? ప్రత్యేక హోదా సాధించడానికి ఆంధ్రప్రదేశ్‌కు తగిన అర్హతలు లేవని! ఆయన కొత్తగా మరొక కొత్త విషయం కూడా చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చలేదని! దేశంలో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని మరో విషయాన్ని కూడా వెంకయ్య నాయుడు బయట పెట్టేశారు. అదేమిటంటే.. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడం యూపీఏ పాపమేనని!

ప్రత్యేక హోదా ఇవ్వాలంటే సదరు రాష్ట్రంలో కొండ ప్రాంతాలు ఉండాలట. ఇతర దేశాలతో సరిహద్దులు ఉండాలట. జన సాంధ్రత తక్కువగా ఉండాలట. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రం అయి ఉండాలట. రెవెన్యూ లోటు గణనీయంగా ఉండాలట! వీటిలో కేవలం రెవెన్యూ లోటు తప్ప ఏపీకి మిగిలిన అర్హతలు ఏవీ లేవని వెంకయ్య నాయుడు చెప్పారు. వాస్తవానికి, ఆంధ్రప్రదేశ్‌ విభజించే సమయంలోనే వెంకయ్య నాయుడుకు ఇవన్నీ తెలుసు. అందుకే అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టారు. అప్పట్లో బీజేపీ కాంగ్రెస్‌తో లోపాయికారీ అవగాహన కుదుర్చుకోకుండా ఉండి ఉంటే.. రాష్ట్ర విభజన జరిగితే తమకు కూడా లాభం జరుగుతుందనే రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్‌ ప్రతిపాదనకు తల ఊపకుండా ఉండి ఉంటే.. అప్పట్లో కనీసం అద్వానీ మాటకు విలువ ఇచ్చి ఉంటే ఏపీకి ఇప్పుడు ఈ దుస్థితి వచ్చేది కాదు. ప్రత్యేక హోదా కోసం ఇన్నిసార్లు దేబిరించాల్సిన అవసరమూ ఉండేది కాదు.

అప్పట్లో ప్రత్యేక హోదా అంశాన్ని రాజ్యసభలో చట్టంలో పెట్టి తీరాల్సిందేనని, ఆ తర్వాత లోక్‌సభలోనూ దానిని ఆమోదించాలని బీజేపీ మరీ ముఖ్యంగా వెంకయ్య నాయుడు పట్టుబట్టి ఉంటే యూపీఏ ప్రభుత్వం తప్పనిసరిగా చేసిఉండేది. ఎందుకంటే, తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజనకు తెర తీసింది కనక.. దానికి విఘాతం కలుగుతుందనుకుంటే మళ్లీ లోక్‌సభలో బిల్లు పెట్టడానికి కూడా వెనకాడేది కాదు. కానీ, కాంగ్రెస్‌ 'విజ్ఞప్తి'కి వెంకయ్య కూడా రాజీ పడ్డారు. బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని పెట్టకపోయినా, కేవలం కేబినెట్‌లోనే ఆమోదించినా దానికి తలూపారు. ఆ తర్వాత, కూడా ఏపీకి ప్రత్యేక హోదా రావడానికి తగిన అర్హతులు ఆయనకు, మోదీకి తెలుసు. అప్పటికే బీహార్‌ సహా చాలా రాష్ట్రాలు హోదా కోరుతున్నాయని కూడా తెలుసు. అయినా, కాంగ్రెస్‌ బిల్లులో పెట్టలేదని, అయినా తాము ఇస్తామని ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌తో బీజేపీ రాజీ పడడం కారణం.. అప్పట్లో ప్రత్యేక హోదా గురించి ప్రకటనలు చేయడం తప్ప పట్టుబట్టకపోవడం వల్లే దానిని బిల్లులో పెట్టలేదు. అప్పుడే బీజేపీ పట్టుబట్టి ఉంటే ఆ క్రెడిట్‌ కూడా వెంకయ్యకే దక్కేది.

కానీ, ఇప్పుడు కాంగ్రెస్‌ను మరీ ముఖ్యంగా యూపీఏను విమర్శించి.. ఏపీకి అర్హతలు లేవని చెప్పడం ద్వారా ఆయన సాధించేది ఏమీ ఉండదు. అప్పట్లో జరిగిన పరిణామాలన్నీ ఏపీలోని ప్రతి ఒక్కరికీ బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తెలుసు. ప్రత్యేక హోదాను అమలు చేయకపోతే బీజేపీ ఏపీలో బద్నాం కావడం తప్ప మరొకటి ఉండదని, ప్రత్యామ్నాయంగా ఏమి ఇచ్చినా ప్రజల్లో భావోద్వేగాలు తగ్గే అవకాశం ఉండదని విశ్లేషకులు వివరిస్తున్నారు.