Begin typing your search above and press return to search.

గాంధీ ఫ్యామిలీస్‌ని బజార్లో పెట్టాడు

By:  Tupaki Desk   |   2 July 2015 7:10 AM GMT
గాంధీ ఫ్యామిలీస్‌ని బజార్లో పెట్టాడు
X
తన వరుస ట్వీట్స్‌తో అధికార.. విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఐపీఎల్‌ మాజీ బాస్‌ లలిత్‌మోడీ తాజాగా గాంధీల ఫ్యామిలీలపై ఫైరయ్యాడు. ఆయన చేసిన ఆరోపణలతో ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. సోనియాగాంధీ ఫ్యామిలీకి.. మేనకాగాంధీ ఫ్యామిలీకి మధ్య సంబంధాలు అంతంతమాత్రమే అన్న స్థానం నుంచి.. సోనియాగాంధీకి తన భర్త అన్న కొడుకు ఆర్థిక అంశాల్లో చాలా సన్నిహితం అన్న అర్థం వచ్చేలా ఆయన తాజా ట్వీట్స్‌ ఉండటం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం గాంధీ ఫ్యామిలీల మధ్య పెద్ద దూరం లేదన్న విషయంతో పాటు.. కాంగ్రెస్‌.. బీజేపీలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

లండన్‌లోని తన నివాసంలో వరుణ్‌గాంధీ తనను కలుసుకున్నారని.. తన అన్ని వ్యవహారాలను సోనియాతో సెటిల్‌ చేసుకునేలా డీల్‌ కుదిర్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లుగా వెల్లడించారు.

''కొన్నేళ్ల కిందట వరుణ్‌గాంధీ నన్ను లండన్‌లోని మా ఇంట్లో కలిశారు. సమస్యల్ని పరిష్కరించటానికి ఇటలీలోని సోనియా సోదరితో మాట్లాడాలని చెప్పారు. ఆంటీ (సోనియాగాంధీ) 60 మిలియన్‌ డాలర్లు (మన రూపాయిల్లో 380కోట్లు) ఇవ్వమని చెప్పారు'' అని పేర్కొన్న ఆయన.. ఆ డీల్‌ను కుదరదని చెప్పినట్లుగా పేర్కొన్నారు. దీన్ని వరుణ్‌గాంధీ అర్థం లేని ఆరోపణగా కొట్టిపారేశారు.

తన గౌరవానికి భంగం కలిగేలా లలిత్‌ ఆరోపణలు ఉన్నాయని ఆయన విరుచుకుపడ్డారు. అదే సమయంలో.. లలిత్‌ ట్వీట్స్‌ను బీజేపీ సమర్థిస్తూ.. ఆరోపణలున్న వ్యక్తులు ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన వారని చెప్పుకునే ప్రయత్నం చేశారు. వేర్వేరు పార్టీలు అయినా.. ఒకటే ఫ్యామిలీ కదా అనే విషయానికి ఎవరూ ఎలాంటి వివరణ ఇచ్చింది లేదు.

వరుణ్‌ ఖండనలతో మరింత చెలరేగిపోయిన లలిత్‌మోడీ మరో ట్వీట్‌ చేస్తూ.. ''ప్లీజ్‌ మిస్టర్‌ వరుణ్‌గాంధీ.. ఆంటీ ఏం కోరారో ప్రపంచానికి తెలియనివ్వండి. మనిద్దరి స్నేహితుడు.. ప్రపంచప్రసిద్ధ జ్యోతిష్యుడే ఈ ఉదంతానికి సాక్ష్యం. మీరు లండన్‌లోని రిట్జ్‌ హోటల్‌లో బస చేసినప్పుడు నన్ను కలిశారా? లేదా? స్పష్టం చేయండి ప్లీజ్‌'' అంటూ మరింత ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.

బుధవారం తన ట్వీట్స్‌తో వరుణ్‌.. సోనియాలను ఒకే సీన్లోకి తీసుకొచ్చిన లలిత్‌మోడీకి సంబంధించి మరో వ్యవహారం బయటకు వచ్చింది. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ భర్త స్వరాజ్‌ కౌశల్‌కు తన సంస్థ అయిన ఇండోఫిల్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ పదవి ఇచ్చే ప్రయత్నం చేయటం.. దానికి ఆయన తిరస్కరించిన వైనాన్ని ఒక ఛానల్‌ బయటపెట్టింది. దీనిపై సుష్మా స్వరాజ్‌ భర్త స్పందిస్తూ.. సదరు ప్రతిపాదన నిజమేనని వెల్లడించారు. మొత్తంగా తన వైఖరితో.. తన ట్వీట్స్‌తో ఎప్పుడు ఎవరిని రచ్చకు ఈడుస్తారో అర్థం కాని పరిస్థితిని పార్టీలకు అతీతంగా అందరి నాయకులకు కలిగించటంలో లలిత్‌మోడీ సక్సెస్‌ అవుతున్నారు.