Begin typing your search above and press return to search.

ఫస్టాఫ్‌ రివ్యూ: కళ్యాణ్‌రామ్‌ ఒక్కడే మొనగాడు

By:  Tupaki Desk   |   1 July 2015 11:30 AM GMT
ఫస్టాఫ్‌ రివ్యూ: కళ్యాణ్‌రామ్‌ ఒక్కడే మొనగాడు
X
చూస్తుండగానే 2015లో ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఆర్నెల్లలో టాలీవుడ్‌లో ఏకంగా 135 సినిమాలు విడుదలవడం విశేషమే. ఒకప్పుడు సంవత్సరమంతా 135 సినిమాలు రిలీజవడమే గగనం.. కానీ ఇప్పుడు ఆర్నెల్లలోనే అన్ని సినిమాలంటే మామూలు విషయం కాదు. ఐతే రాశిదేముంది చెప్పండి. వాసి ముఖ్యం కానీ. ఈ 135 సినిమాల్లో పదిశాతం సినిమాలు కూడా సక్సెస్‌ అవ్వకపోవడమే విచారించాల్సిన విషయం. ఈ 135 సినిమాల్లో తెలుగు స్ట్రెయిట్‌ సినిమాలు 70 దాకా ఉన్నాయి. అందులో సూపర్‌ హిట్‌ అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క సినిమానే ఉంది. అది.. పటాస్‌. కళ్యాణ్‌ రామ్‌ హీరోగా కొత్త దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా పెట్టుబడి మీద రెట్టింపు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌ స్థాయిని అందుకుంది.

ఐతే పటాస్‌ కన్నా భారీగా వసూలు చేసిన సినిమాలు లేకపోలేదు. కానీ పెట్టుబడితో పోల్చి చూస్తే అవేవీ కూడా సూపర్‌ హిట్‌ స్థాయిని అందుకోలేదు. టెంపర్‌ సినిమా చాలామందికి బ్లాక్‌బస్టర్‌ అనిపించి ఉండొచ్చు. 'గోపాల గోపాల' హిట్టులా కనిపించి ఉండొచ్చు. 'సన్నాఫ్‌ సత్యమూర్తి' కూడా సూపర్‌ హిట్‌లా భ్రమింపజేసి ఉండొచ్చు. ఐతే 40-50 కోట్ల మధ్య వసూళ్లు సాధించినంత మాత్రానే ఇవేవీ కూడా సూపర్‌ హిట్‌ ముద్ర వేసుకోలేవు. వాటి మీద పెట్టిన పెట్టుబడి ప్రకారం చూస్తే ఇవీ.. నిరాశ పరిచాయనే చెప్పాలి. టెంపర్‌ సినిమాకు సూపర్‌ హిట్‌ టాక్‌ వచ్చింది. మంచి రివ్యూస్‌, మౌత్‌ టాక్‌ తోడైంది. పబ్లిసిటీ కూడా బాగానే చేశారు. కానీ వసూళ్లు అనుకున్న స్థాయిలో లేవు. తొలిసారి ఎన్టీఆర్‌ 50 కోట్ల క్లబ్‌లో చేరతాడని అంచనా వేశారు కానీ.. టెంపర్‌ వసూళ్లు చివరికి రూ.45 కోట్ల దగ్గర ఆగాయి. ఐతే ఈ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌ను రూ.43 కోట్లకు అమ్మారు. అంటే లాభం కేవలం రెండు కోట్లే అన్నమాట. కాబట్టి ఈ సినిమా అతి కష్టం మీద హిట్‌ స్థాయిని అందుకుందని చెప్పాలి. ఇక సంక్రాంతికి వచ్చిన 'గోపాల గోపాల'కు మంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. కానీ వసూళ్లు ఆ స్థాయిలో లేవు. పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్‌ లాంటి స్టార్‌ హీరోలు నటించినప్పటికీ మాస్‌ ఆడియన్స్‌ను ఈ సినిమా అంతగా మెప్పించకపోవడంతో కలెక్షన్స్‌ డల్‌ అయ్యాయి. చివరికీ సినిమా రూ.43 కోట్లు వసూలు చేసింది. ఐతే థియేట్రికల్‌ రైట్స్‌ అమ్మింది రూ.46 కోట్లకు. అంటే మూడు కోట్లు లాస్‌ అన్నమాట. అందుకే ఈ సినిమా 'ఏవరేజ్‌' అనిపించుకుంది. ఈ ఆర్నెల్లలో యాభై కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక సినిమా సన్నాఫ్‌ సత్యమూర్తి. కానీ ఈ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌ను రూ.555 కోట్లకు అమ్మారు. డివైడ్‌ టాక్‌ను కూడా తట్టుకుని ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరడం గొప్ప విషయమే కానీ.. సినిమాను కొన్నవారందరికీ సంతోషాన్నయితే మిగల్చలేదు. రామ్‌ సినిమా 'పండగచేస్కో' అతి కష్టం మీద బ్రేక్‌ ఈవెన్‌కు వచ్చింది. ఈ సినిమా రూ.15 కోట్ల దాకా వసూలు చేసింది.

డబ్బింగ్‌ సినిమాలు బెటర్‌

తెలుగు స్ట్రెయిట్‌ సినిమాలతో పోలిస్తే ఫస్టాఫ్‌లో డబ్బింగ్‌ సినిమాల పరిస్థితి కొంచెం బెటర్‌ అని చెప్పాలి. రాఘవ లారెన్స్‌ నటించి దర్శకత్వం వహించిన 'గంగ' ఏకంగా రూ.20 కోట్లు వసూలు చేసి సూపర్‌ హిట్‌ అనిపించుకుంది. ఏడాది ఆరంభంలో వచ్చిన ధనుష్‌ సినిమా 'రఘువరన్‌ బీటెక్‌' అతడికి తెలుగులో తొలి హిట్‌ ఖాతాలో వేసింది. ఓకే బంగారం కూడా బాగానే ఆడింది. ఉత్తమవిలన్‌కు మంచి టాక్‌ అయితే వచ్చింది కానీ.. ఆ సినిమా నష్టాలే మిగిల్చింది. అజిత్‌ సినిమా ఎంతవాడుగాని.. ఓ మాదిరిగా ఆడింది. పిశాచి కూడా మన జనాల్ని ఆకట్టుకుంది. అనేకుడు, డాక్టర్‌ సలీమ్‌, మగమహారాజు పర్వాలేదనిపించాయి. ఇంగ్లిష్‌ డబ్బింగ్‌ సినిమాల్లో ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌, ఏవెంజర్స్‌, జురాసిక్‌ వరల్డ్‌లకు మంచి వసూళ్లు దక్కాయి.

బాగా ఆడలేదు కానీ..

వసూళ్ల లెక్కల్లో చూస్తే ఫ్లాప్‌, ఏవరేజ్‌ అనిపించుకున్న కొన్ని మంచి సినిమాలు ప్రథమార్ధంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. శర్వానంద్‌, నిత్యామీనన్‌ల 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'. ఓనమాలు ఫేమ్‌ క్రాంతి మాధవ్‌ రూపొందించిన ఈ సినిమా మంచి ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీ అనిపించుకుంది. అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాను బాగానే ఆదరించారు. వరుస ఫ్లాపుల తర్వాత నాని గ్యాప్‌ తీసుకుని చేసిన 'ఎవడే సుబ్రమణ్యం' కూడా మంచి ప్రయత్నంగా విమర్శకుల ప్రశంసలు పొందింది. మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌కు ఈ సినిమా బాగా నచ్చింది. ఇక స్వామిరారా, కార్తికేయ తర్వాత నిఖిల్‌ నటించిన 'సూర్య వెర్సస్‌ సూర్య' కూడా ఓ విభిన్నమైన సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ తరం కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్‌ 'అసుర' సినిమాతో తన అభిరుచిని మరోసారి చాటుకున్నాడు. ఈ సినిమా బ్రేక్‌ఈవెన్‌కు వచ్చింది. ఈ నాలుగు సినిమాలకు భారీ వసూళ్లు లేకున్నా.. నిర్మాతలు సేఫ్‌ అయ్యే స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.

ఫ్లాపులే ఫ్లాపులు

ప్రథమార్ధంలో ఫ్లాప్‌లు చాలానే ఉన్నాయి. గత ఏడాది 'లెజెండ్‌'తో బ్లాక్‌బస్టర్‌ హిట్టు కొట్టిన బాలయ్య ఈసారి తన మ్యాజిక్‌ చూపించలేకపోయాడు. 'లయన్‌' బాలయ్య కెరీర్లో పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. నాగచైతన్య సినిమా 'దోచేయ్‌' కూడా అంచనాల్ని అందుకోలేక ఫ్లాప్‌ అయింది. వైవీఎస్‌ చౌదరి ఎన్నో ఆశలు పెట్టుకున్న 'రేయ్‌' డిజాస్టరే. అల్లరి నరేష్‌ 'బందిపోటు', నాని 'జెండాపై కపిరాజు', రవిబాబు 'అవును-2', సుధీర్‌ బాబు 'మోసగాళ్లకు మోసగాడు' మంచు లక్ష్మి 'దొంగాట' కూడా నిరాశ పరిచాయి. గోపీచంద్‌ సినిమా 'జిల్‌'కు మంచి టాక్‌ వచ్చినా అది బిలో ఏవరేజ్‌ సినిమాగా మిగిలింది. జ్యోతిలక్ష్మీ, దాగుడుమూతల దండాకోర్‌, భమ్‌ బోలేనాథ్‌, లేడీస్‌ అండ్‌ జెంటిల్మన్‌ లాంటి సినిమాలు కూడా బాక్సాఫీస్‌ దగ్గర నిలవలేకపోయాయి. సమ్మర్‌లో వస్తాయనుకున్న బాహుబలి, రుద్రమదేవి, కిక్‌-2, శ్రీమంతుడు లాంటి సినిమాలు ద్వితీయార్ధానికి వాయిదా పడటంతో ఫస్టాఫ్‌ అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్‌ దగ్గర సందడి కనిపించలేదు.