Begin typing your search above and press return to search.

ఆన్‌సెట్స్‌ .. షాకింగ్‌ ఎటెంప్ట్స్‌!!

By:  Tupaki Desk   |   2 July 2015 5:30 PM GMT
ఆన్‌సెట్స్‌ .. షాకింగ్‌ ఎటెంప్ట్స్‌!!
X
టాలీవుడ్‌ మగువలకు ఎంతో అనుకూలమైనది. ఇక్కడ షూటింగ్‌ వాతావరణం చాలా బావుంటుంది. ఆన్‌సెట్స్‌ అందరూ మర్యాద పూర్వకంగా నడుచుకుంటారు. స్పాట్‌ బోయ్‌ నుంచి లైట్‌మేన్‌ వరకూ ఎవరూ అమ్మాయిల గౌరవానికి భంగం కలిగించరు. నాయికల్ని సొంత అక్కా చెల్లెళ్ల లాగా చూసుకుంటారు... ఇలాంటివన్నీ మన హీరోయిన్‌ల నోటి నుంచి వింటుంటాం. అయితే వీటన్నిటికీ రివర్సులో మాట్లాడే వాళ్లు ఉన్నారంటే నమ్మగలరా? ఓసారి ఈ విషయంపై ఫోకస్‌ పెడితే తెలిసిన సంగతులివి.

టాలీవుడ్‌ అత్యంత అననుకూలమైన పరిశ్రమ. అమ్మాయిలకు ఏమాత్రం భద్రత లేదిక్కడ. హీరోయిన్‌ని రబ్బరు బొమ్మలా చూస్తారంతా. సెట్‌లో కథానాయికలకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు కూడా ఇవ్వరు. సరైన బస కూడా ఏర్పాటు చేయరు. అందుకే ఓ సినిమా షూటింగ్‌ విషయంలో డుమ్మా కొట్టాల్సి వచ్చిందని గతంలో ఓ ఇద్దరు స్టార్‌ హీరోయిన్లు విమర్శలతో చెడుగుడు ఆడేశారు. నయనతార, ఇలియానా లాంటి కథానాయికలు కెరీర్‌ ప్రారంభంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. ఆ మాటను పలుమార్లు బైటికే చెప్పారు. కొన్ని సంస్థలు వసతుల విషయంలో కక్కుర్తి పడుతుంటాయి. దానివల్ల కొన్ని ఇబ్బందుల్ని కూడా ఎదుర్కోవాల్సొస్తుందని నయన్‌ ఒకానొక సందర్భంగా విమర్శించింది. కొందరు నిర్మాతల బంధువుల కుర్రాళ్లలో కొంటెతనం భరించాల్సొచ్చిందని సెలవిచ్చింది. దేవదాసు టైమ్‌లో ఇలియానా అయితే ఓ దర్శకుడి నుంచి థ్రెట్‌ ఎదుర్కొన్నానని స్టార్‌ హీరోయిన్‌ అయిన తర్వాత ఒక సందర్భంలో ఓపెన్‌గానే చెప్పింది. ద్వితీయ శ్రేణి కథానాయికలు, క్యారెక్టర్‌ నటీమణుల విషయంలో కొన్ని అపశ్రుతులు దొర్లిన వార్తలు ప్రముఖంగా కొన్ని పత్రికల్లో, టీవీ మీడియాల్లో చూస్తూనే ఉన్నాం. అప్పట్లో టాలీవుడ్‌ సినిమాల్లో నటించడానికి వచ్చిన ఒక ముంబై మోడల్‌ని ఏజెంట్లు దారుణంగా మోసం చేసి నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారన్న వార్త సంచలనమైంది.

ఇటీవలే పూరి జగన్నాథ్‌ భార్య విషయంలో ఓ వివాదం చెలరేగింది. తనయుడు ఆకాశ్‌ హీరోగా నటించిన 'ఆంధ్రాపోరి' షూటింగులో ఓ ఎస్పై అసభ్య కరంగా ప్రవర్తించాడంటూ వార్తలొచ్చాయి. దీనిపై పోలీస్‌ కేసు నడుస్తోందిప్పుడు. ఈ వివాదాలు ఇలా ఉండగానే కొనసాగింపుగా మరో హీరోయిన్‌ టాలీవుడ్‌ వాతావరణం కలుషితం అంటూ తీవ్రమైన ఆరోపణలు చేసింది. బాలకృష్ణ సరసన లెజెండ్‌, లయన్‌ చిత్రాల్లో కథానాయికగా నటించిన రాధికా ఆప్టే .. టాలీవుడ్‌లో ఆడవాళ్లకు గౌరవమే లేదు.. అంటూ ఆరోపించింది. కారణం రివీల్‌ చేయలేదు కానీ.. ఈ స్టేజీ నటి కం ఆర్టిస్టుకి ఏదో ఒక సందర్భంలో భంగం కలగడం వల్లే ఇలా ఆరోపించిందని భావించాల్సొస్తోంది. ఇలాంటి రూమర్లు మన గౌరవానికి భంగం కలిగించేవే. వీటన్నిటికీ మా అసోసియేషన్‌, నిర్మాతల మండలి, ఫిలింఛాంబర్‌లో ఏదైనా పరిష్కారం కనుగుంటే బావుండేదే. దీనికోసం ప్రత్యేకించి ఓ సెల్‌ ఏర్పాటు చేస్తే పరువు నష్టాన్ని నివరించేందుకు ఆస్కారం ఉంటుంది.