Begin typing your search above and press return to search.

పార్టీ ఫిరాయింపుల గురించి ప్రణబ్‌ ఆరా తీశారా?

By:  Tupaki Desk   |   6 July 2015 4:46 AM GMT
పార్టీ ఫిరాయింపుల గురించి ప్రణబ్‌ ఆరా తీశారా?
X
ఎవరైనా ప్రముఖులకు వినతి పత్రం ఇవ్వటం.. తమ సమస్యలకు పరిష్కారం చూపమని చెప్పటం.. న్యాయం చేయమని కోరటం మామూలే. ప్రముఖులకు ఇచ్చే ఫిర్యాదులపై మర్యాదపూర్వకంగా వాటిని తీసుకొని.. న్యాయం చేస్తామని చెప్పి పంపించటం మామూలే. కానీ.. తాజాగా తెలంగాణ తెలుగుదేశం నేతలు రాష్ట్రపతి ప్రణబ్‌కు వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా ఆయన కొన్ని అంశాలపై ప్రశ్నలు వేశారా? వినతిపత్రం అందుకొని పంపేయకుండా.. వారి వాదనను ఓపిగా విన్నారా? అంటే.. అవునని చెబుతున్నా టీటీడీపీ నేతలు.

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ విపక్షం టీటీడీపీ నేతలు ఒక వినతి పత్రాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ టీడీపీ తరఫున పోటీ చేసి గెఇచారని.. ప్రస్తుతం ఆయన మంత్రిగా కొనసాగుతున్నట్లుగా చెప్పారు. దీనిపై స్పందించిన ప్రణబ్‌.. టీటీడీపీ నేతలు ఇచ్చిన వినతిపత్రాన్ని అసాంతం చదివి పలు విషయాల్ని తెలుసుకున్నట్లు చెబుతున్నారు.

తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున తన ఓటుహక్కును వినియోగించుకున్నారని ప్రశ్నించటంతో పాటు.. ఏయే పార్టీలకు చెందిన సభ్యులు ఎంతమంది అధికార టీఆర్‌ఎస్‌లోకి చేరిన విషయాన్ని ఆరా తీసినట్లు చెబుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీలో అధికారపార్టీకి బలం 63 మాత్రమే అయినప్పటికీ.. విపక్షాల్ని పార్టీలో చేర్చుకోవటం ద్వారా బలం 83కు పెరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న రాష్ట్రపతి.. పార్టీ ఫిరాయింపుల వ్యాజ్యం కోర్టులో పెండింగ్‌లో ఉంది కదా అని గుర్తు చేసినట్లు చెబుతున్నారు.

పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసిందని.. అనారోగ్యం కారణంతో ఆసుపత్రిలో చేరటం ద్వారా వాటికి సమాధానాలు చెప్పకుండా స్పీకర్‌ దాటవేస్తున్నారని టీడీపీ బృందం ఫిర్యాదు చేయటంతో మరోసారి స్పందించిన ప్రణబ్‌.. మీ వినతిపత్రాన్ని కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపించి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నట్లు తెలిసింది. మొత్తమ్మీదా పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ప్రణబ్‌.. ప్రత్యేకంగా ప్రశ్నించటంతో పాటు పలు విషయాలకు సంబంధించిన సమాచారం సేకరించటం ఆసక్తికరంగా మారిందని చెబుతున్నారు.