Begin typing your search above and press return to search.

కత్తుల్లాంటి లాయర్లను దించుతోన్న టీ సర్కారు

By:  Tupaki Desk   |   3 July 2015 8:05 AM GMT
కత్తుల్లాంటి లాయర్లను దించుతోన్న టీ సర్కారు
X
ఓటుకు నోటు వ్యవహారం రోజురోజుకీ వ్యక్తిగత అంశంగా మారిపోతోంది. ఈ ఇష్యూ విషయంలో వ్యక్తిగత ప్రతిష్ఠలు వచ్చి చేరటంతో ప్రతి అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం మామూలైంది. రేవంత్‌కు బెయిల్‌ ఇప్పించేందుకు ప్రముఖ లాయర్లను తెలుగుదేశం పార్టీ రంగంలోకి దించిన విషయం తెలిసిందే.

రేవంత్‌కు హైకోర్టును బెయిల్‌ వచ్చిన నేపథ్యంలో దాన్ని రద్దు చేయాలని కోరుతూ.. తెలంగాణ ఏసీబీ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లటం తెలిసిందే. రేవంత్‌కు వచ్చిన బెయిల్‌ను రద్దు చేసే విషయంలో తెలంగాణ సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని చెబుతున్నారు.

తెలంగాణ ఏసీబీ తరఫున వాదించటానికి కత్తుల్లాంటి సీనియర్‌ లాయర్లను తెలంగాణ సర్కారు రంగంలోకి దించుతోంది. సీనియర్‌ లాయర్లు అయిన కపిల్‌ సిబల్‌.. దుష్యంత్‌దవే.. హరేన్‌రావెల్‌లను రంగంలోకి దించుతోంది.

బెయిల్‌ వచ్చిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. తెలంగాణ ముఖ్యమంత్రి.. మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి.. ప్రజల చేత తరిమితరిమి కొట్టేందుకు తన జీవితాన్ని వెచ్చిస్తానని వ్యాఖ్యానించటం తెలిసిందే. రేవంత్‌ విషయంలో వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకున్న తెలంగాణ సర్కారు.. బెయిల్‌ విషయంపై వాదించేందుకు సీనియర్‌ లాయర్లను ఎంపిక చేసిందని చెబుతున్నారు. మరి.. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో..?