Begin typing your search above and press return to search.

రాహుల్‌ ఇలా అయిపోయాడేంటి?

By:  Tupaki Desk   |   26 May 2015 4:54 AM GMT
రాహుల్‌ ఇలా అయిపోయాడేంటి?
X
దాదాపు రెండున్నర నెలల అజ్ఞాత వాసం తర్వాత రాజకీయాల్లో ఆక్టివ్‌ గా పాల్గంటున్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గతంలో కంటే కాస్త మెరుగైన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని రాష్ట్రాల్లోని రైతులను కలిసి వస్తూ రాహుల్‌ రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. గతంలోని తన శైలిలో కాకుండా...బీజీపీపై పదునైన విమర్శలు చేస్తున్నారు. అయితే ఆ విమర్శలు బీజేపీ వారికి సహజంగానే కంటగింపుగా మారుతున్నాయి. తాజాగా బీజేపీ నేత, కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ రాహుల్‌ పై తీవ్ర విమర్శలు చేశారు.

రాహుల్‌ గాంధీకి ఉల్లిగడ్డకు పిజ్జాకు(ప్యాజ్‌ అండ్‌ పిజ్జా) తేడా తెలియదని నఖ్వీఎద్దేవా చేశారు. అలాంటి రాహుల్‌ రైతుల నాయకుడుగా ముందుకొస్తున్నారని విమర్శించారు. ''రాహుల్‌కు ఉల్లిగడ్డలు, పిజ్జాలు, వంకాయలు, బర్గర్లకు తేడా తెలియదు. కానీ, ఆయన రైతుల నాయకుడుగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన ఎప్పటికీ ఈ విషయంలో విజయవంతం కాలేరు''అని జోస్యం కూడా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న పనులను ఓర్వలేకనే రాహుల్‌ రైతు వేషంలో మోసం చేసేందుకు ప్రజల వద్దకు వెళుతున్నారని మండిపడ్డారు.

తొలిసారి రాజకీయాలకంటే దేశ అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం తమదని కొనియాడారు. మోడీ నాయకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్ఠ పెరిగిందని చెప్పారు. నరేంద్రమోడీ ఘనతను అసత్యాలతో మార్చివేస్తున్నారని వాస్తవాలేంటో ప్రజలకు, మీడియా తెలియజేయాలని కోరారు.

మొత్తానికి తమ సర్కారును విమర్శించిన రాహుల్‌ గాంధీని చంటిపిల్లాడికి కూడా తెలిసిన ఉల్లిగడ్డ, పిజ్జాలపై అవగాహన లేదని అనడం కాస్త ఎక్కువ చిన్నబుచ్చడమే మరి.