Begin typing your search above and press return to search.

రాకింగ్‌ రఘువీరా....

By:  Tupaki Desk   |   26 May 2015 10:48 AM GMT
రాకింగ్‌ రఘువీరా....
X
ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఎన్‌ రఘువీరారెడ్డి ఈ మధ్య కాలంలో రాకింగ్‌ స్టార్‌ గా మారుతున్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొందరు పీసీసీ చీఫ్‌ లను మార్చినప్పటికీ... రఘువీరా సేఫ్‌ సైడ్‌ లో ఉండిపోయారు. దీంతో తన సీటుకు భరోసా ఉందనుకున్న రఘువీరా అధికార పక్షాలను చెడుగుడు ఆడుకుంటున్నారు.

ఎన్నికల హామీలు అమలు చేయడంలో టీడీపీ ఘోర వైఫల్యం చెందిందని రఘువీరా ఆరోపించారు. ఎన్నికల సమయంలో టీడీపీ దాదాపు 600 హామీలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. వాటిలో కొన్నింటి ఊసే ఎత్తలేదని, ఇంక అమలు సంగతి ఎక్కడ అని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్నికల గుర్తింపును రద్దు చేయాలని హైదరాబాద్‌ లో ఎన్నికల సంఘానికి రఘువీరా నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.


అనంతరం రఘువీరా రెడ్డి మాట్లాడుతూ... టీడీపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు పరిచేందుకు ఆ పార్టీపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. నిత్యం పోరాటం చేస్తున్నామని ఎన్నికల సంఘానికి వినతి పత్రాన్ని అందజేయడం ఇందులో ఒక భాగమన్నారు. క్షేత్రస్థాయి పోరాటాలను సైతం తాము ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రఘువీరా స్పష్టం చేశారు.

మొత్తానికి ఏపీలో కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్‌ కు ప్రాణం పోయడమే లక్ష్యంగా రఘువీరా భలే కష్టపడుతున్నారు.