Begin typing your search above and press return to search.

మాజీ స్పీకర్‌కు మరో అవకాశం!

By:  Tupaki Desk   |   23 May 2015 5:55 AM GMT
మాజీ స్పీకర్‌కు మరో అవకాశం!
X
ఎట్టకేలకూ ప్రతిభా భారతి కి ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఆమెకు అవకాశం లభించింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆమెకు అవకాశాన్ని ఇచ్చారు. ఎంతోమంది తెలుగుదేశం నేతలు ఈ అవకాశం కోసం పోరాడుతున్నా అదృష్టం ఆమెను వరించింది.

ప్రత్యేకించి ఆమె గురించి చెప్పుకోవడం ఎందుకంటే.. పదేళ్ల తర్వాత ఆమెకు మంచి పదవి దక్కుతోంది! ఒకప్పుడు ఒక స్థాయిలో ఉన్న ఆమె వరసగా ఎన్నికల్లో ఓటమి పాలై రాజకీయ నేతగా వెనుకబడ్డారు. అయితే ఇప్పుడు బాబు ఆమెకు మరో అవకాశాన్ని ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌గా ప్రతిభా భారతి ఉండేవారు. 1999 నుంచి 2004ల మధ్య ఉండిన తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో ఆమె అసెంబ్లీ స్పీకర్‌గా చేశారు. ఒక దళిత మహిళను స్పీకర్‌గా చేశామని అప్పట్లో బాబు ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనేది.

స్పీకర్‌గా క్రియాశీలకంగానే కనిపించినా 2004లో ఆమెను అదృష్టం వరించలేదు. ఆమె ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. అదే సమయంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేయడంతో.. వరసగా రెండు సార్లు ఆ పార్టీ ప్రభుత్వం రావడంతో.. ప్రతిభా భారతి వంటి వారు మరుగయ్యారు. ఎమ్మెల్యేగా గెలవలేకపోవడంతో వారి పరిస్థితి అలా అయిపోయింది.

అయితే ఏడాది కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం గెలవడం మరుగున ఉన్న ఇలాంటి నేతలకు ఊరటగా మారింది. ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. ఇప్పటినే నామినేషన్‌ వేశారామె. ఎన్నిక కూడా ఏకగ్రీవమే కాబట్టి.. ఆమెకు ఎమ్మెల్సీ హోదా లాంఛనమే!