Begin typing your search above and press return to search.

చంద్రుళ్ల కుళ్లల్లో గుచ్చేశాడా?

By:  Tupaki Desk   |   6 July 2015 4:59 PM GMT
చంద్రుళ్ల కుళ్లల్లో గుచ్చేశాడా?
X
ఒక మాట అంటే దులిపేసుకోవచ్చు. ఒక దెబ్బ కొడితే.. వదిలేయొచ్చు. కానీ.. కంట్లో సూటిగా వేలు పెట్టి పొడిచేస్తే.. నిజానికి ఇలాంటివి జరుగుతాయని ఊహించటం కష్టం. ఇక.. బాధ్యతతో ఉంటూ.. ఆచితూచి వ్యవహరించే పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ లాంటి వారు.. నోరు విప్పితే ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరూ ఎవరో ఒకవైపే నిలుచొని మాట్లాడటం.. ఎవరో ఒకరి వాదనను భుజాన వేసుకొని మాట్లాడటం అలవాటైన నేపథ్యంలో.. అందుకు భిన్నంగా ఎవరైనా ఒకటే.

తప్పు చేసిన వాడిని చెండాడుతా. ప్రశ్నలతో నిలదీస్తా? సమాధానం కోసం ప్రశ్నిస్తా? లాంటి రాజకీయ నేత ఎక్కడ ఉంటాడు. నిద్ర లేస్తే.. కులం.. మతం.. ప్రాంతం లాంటి మత్తుమందుల్ని ఒళ్లంతా నింపుకొని.. చేసే అవినీతి గురించి.. తప్పుడు పనుల గురించి కవర్‌ చేసుకుంటూ.. ఎంతసేపటికి ఎదుటోడి తప్పుల్ని మాత్రమే వేలెత్తి చూపించే దానికి భిన్నంగా.. ఇద్దరు చంద్రుళ్లను ఒకే వేదిక మీద ఉతికి ఆరేసే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో పవన్‌ కల్యాణ్‌ ఒక్కరేమో.

తిట్టటమే పనిగా కాకుండా.. మంచి ఉంటే దాన్ని కూడా ప్రస్తావిస్తూ.. రెండు ప్రాంతాల్లోని తెలుగువారి క్షేమాన్ని మాత్రమే కాంక్షించే పవన్‌ కల్యాణ్‌ లాంటి వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుందనటానికి తాజా ప్రెస్‌మీట్‌ ఒక నిదర్శనం.

ఇద్దరు చంద్రుళ్ల కంట్లో పొడిచేసిన పవన్‌కల్యాణ్‌.. వారిద్దరూ ఊహించలేని విధంగా షాక్‌ ఇచ్చారని చెప్పాలి. తన రాజకీయ స్వార్థం కోసం ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అంటూ.. ప్రతి విషయంలోనూ ప్రాంతీయతను వెతికి వెతికి మరీ చూపిస్తూ.. ఏం ఈ పని చేసేందుకు తెలంగాణటోళ్లు లేరా? ఆ మాత్రం మొనగాళ్లు లేరా? అంటూ రెచ్చగొట్టే కేసీఆర్‌.. తనకు తాను ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన యాదాద్రికి ఆర్కిటెక్ట్‌గా విజయనగరం జిల్లాకు చెందిన ఆనంద్‌ సాయి అనే ఆంధ్రోడ్ని పెట్టుకోవటాన్ని తెరపైకి తీసుకొస్తూ.. తెలుగుజాతి ఐక్యత కోసం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తెలివిగా మెచ్చుకున్నారు.

దీంతో.. ప్రతి విషయంలోనూ తెలంగాణ వారికి పెద్దపీట వేయాలన్నది కేవలం రాజకీయమే తప్పించి.. మరొకటి కాదన్న విషయాన్ని పవన్‌ తేల్చేశారు. ఇలాంటి షాక్‌ ఒక్క కేసీఆర్‌కు మాత్రమే కాదు.. చంద్రబాబుకు కూడా తగిలింది. ప్రత్యేకహోదా గురించి ఏపీ ఎంపీలు ఎందుకు మాట్లాడరన్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. చంద్రబాబుకు ఇబ్బంది కలిగించారు. అంతేకాదు.. సెక్షన్‌ 8 అవసరం లేదని.. ఒకరి అవసరం కోసం సెక్షన్‌ 8 అవసరం లేదని తేల్చేయటం ద్వారా.. ఆయన్ను ఇరుకున పడేసే ప్రయత్నం చేశారు. ఇలా ఒకే ప్రెస్‌మీట్‌లో ఇద్దరు చంద్రుళ్ల కంట్లో వేలు పెట్టేసినంత పని తన మాటలతో చేశారు పవన్‌కల్యాణ్‌.