Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి ప్రణబ్‌కు విశ్రాంతి కరువు!

By:  Tupaki Desk   |   6 July 2015 5:30 PM GMT
రాష్ట్రపతి ప్రణబ్‌కు విశ్రాంతి కరువు!
X
రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వర్షాకాలంలో ఒక పది రోజులు విశ్రాంతి తీసుకుందామని హైదరాబాద్‌ వచ్చారు. కానీ, వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన విశ్రాంతి కరువైపోయింది. ఒక్క రోజు కూడా ఆయన ప్రశాంతంగా నిదరపోలేకపోయారని విశ్లేషకులు వివరిస్తున్నారు. రెండు రాష్ట్రాల వివాదాలు ఆయనకు తలనొప్పిగా మారాయని స్పష్టం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా, రాష్ట్రపతి హైదరాబాద్‌లో కాలుమోపిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద ఆయనకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని గుర్తు చేస్తున్నారు.

రాష్ట్రపతి హైదరాబాద్‌కు వచ్చిన మర్నాడు రెండు సందర్భాల్లో ఆయనను ఏపీ ముఖ్యమంత్రి చందబ్రాబు కలిసిన సంగతి తెలిసిందే. రెండు సందర్భాల్లోనూ ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరుపై ఫిర్యాదు చేశారు. ఆయన ఏకపక్షంగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని తప్పుబట్టారు. దాంతో రాజకీయంగా అనుభవజ్ఞులైన మీరే సర్దుకుపోవాలని కూడా చంద్రబాబుకు రాష్ట్రపతి హితవు పలికారు. ఆ తర్వాత కూడా ఒక్కొక్కరుగా రాష్ట్రపతికి కేసీఆర్‌పై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.

ఆదివారం తెలంగాణ టీడీపీ నేతలు బృందంగా వెళ్లి గవర్నర్‌ మీదా కేసీఆర్‌ మీదా ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత సోమవారం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు వెళ్లారు. వాళ్లు కూడాకేసీఆర్‌ మీదా గవర్నర్‌ నరసింహన్‌ మీదా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏపీకి చెందిన మంత్రులు వెళ్లారు. వాళ్లు కూడా యథా ప్రకారం గవర్నర్‌ నరసింహన్‌ వ్యవహారశైలి, కేసీఆర్‌పై ఫిర్యాదు చేసి వచ్చారు. అంతకుముందు రాష్ట్రపతిని వ్యక్తిగతంగా కలుసుకున్న పలువురు నాయకులు కూడా ప్రధానంగా కేసీఆర్‌పై ఫిర్యాదు చేశారు. ఇక కాంగ్రెస్‌ నాయకుడు మర్రి శశిధర్‌ రెడ్డి అయితే గవర్నర్‌పైనా స్పీకర్‌పైనా ఫిర్యాదు చేశారు.

వరుస ఫిర్యాదుల నేపథ్యంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌లపై రాష్ట్రపతి ప్రణబ్‌కు ఉన్న అభిప్రాయం మారే అవకాశం ఉందని, ఇది భవిష్యత్తులో నిర్ణయాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని విశ్లేషకులు వివరిస్తున్నారు.