Begin typing your search above and press return to search.

ఫ్రీగా చేయటానికి మేనమామ ఏం కాదుగా..?

By:  Tupaki Desk   |   26 May 2015 5:56 AM GMT
ఫ్రీగా చేయటానికి మేనమామ ఏం కాదుగా..?
X
ఆంధ్రప్రదేశ్‌లో కాస్తంత విషయం ఉన్న నేతల్లో వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ రాజకీయ నేత ఎం.వీ. మైసూరారెడ్డి ఒకరు. విషయం ఏదైనా కానీ దాన్ని లోతుల్లోకి వెళ్లి.. అధ్యయనం చేసి తన అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్పటంతో పాటు.. కొన్ని సందర్భాల్లో రాజకీయానికి అతీతంగా మాట్లాడటం మైసూరాకే చెల్లుతుంది. అలాంటి మైసూరారెడ్డి తాజాగా.. ఏపీ రాజధాని మాస్టర్‌ ప్లాన్‌పై మాట్లాడారు.

మాస్టర్‌ప్లాన్‌ని సింగపూర్‌ సర్కారు ఉచితంగా గీసి ఇవ్వటాన్ని ఆయన తప్పు పట్టారు. ఇలాంటి మాస్టర్‌ప్లాన్‌లు.. ఎవరూ ఫ్రీగా చేసి పెట్టరని.. అయినా.. ఏపీ సర్కారుకు సింగపూర్‌ సర్కారు ఏమీ మేనమామ కాదన్న విషయం మర్చిపోకూడదన్నారు.

కాంట్రాక్ట్‌ పొలిటికల్‌ సిస్టమని చెప్పే చైనీయులు.. సింగపూర్‌ని తరిమేసిన విషయాన్ని గుర్తు చేసిన మైసూరా.. ఏపీ రాజధానికి తయారు చేసిన మాస్టర్‌ప్లాన్‌ గొప్పగా ఏమీ లేదని తేల్చేశారు. ఇలాంటి ప్లాన్లు గీయటానికి డబ్బులు.. టెక్నాలజీ.. ప్రభుత్వం అవసరం లేదని.. పార్టీ తరఫున కూడా ఇలాంటి ప్లాన్లు గీయొచ్చని చెప్పుకొచ్చారు. రాజధాని నిర్మాణం విషయంలో ఏపీ సర్కారు అనుసరిస్తున్న విధానాల్ని తప్పు పట్టిన మైసూరా.. ఏపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పని చేస్తుందని వ్యాఖ్యానించారు.

బ్లూప్రింట్‌ గీసి ఇవ్వటం పెద్ద విషయం కాదని తేల్చిన మైసూరా.. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చుకోవటంలోనే పెద్ద సమస్య అని తేల్చారు. సెక్రటేరియట్‌కు.. హైకోర్టు నిర్మాణానికి నిధులు ఇస్తామని విభజన బిల్లులో ఉన్న విషయాన్ని గుర్తు చేసిన మైసూరా.. రాజధాని నిర్మాణానికి అత్యవసరమైన నిధుల కొరతను గుర్తించాలన్నారు.