Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమ్ముడుపోయేదెవరు!?

By:  Tupaki Desk   |   25 May 2015 12:43 PM GMT
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమ్ముడుపోయేదెవరు!?
X
తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమ్ముడుపోయేదెవరో.. పార్టీకి కట్టుబడి ఉండేదెవరో సులువుగానే తేలిపోనుందని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినా టీఆర్‌ఎస్‌ గెలుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినా టీఆర్‌ఎస్‌ గెలుస్తుంది. ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలూ ఎవరూ అమ్ముడుపోకపోతే మాత్రం టీఆర్‌ఎస్‌ ఓడిపోతుంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్‌ మద్దతుతో టీఆర్‌ఎస్‌ నాలుగో అభ్యర్థిని గెలిపించుకుంటుంది. ఐదో అభ్యర్థి గెలవాలంటే మాత్రం కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ సభ్యుల్లో కొంతమంది అధికార పార్టీకి అమ్ముడుపోక తప్పదు. ఉదాహరణకు, ఒక ఎమ్మెల్సీ గెలవడానికి 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఉన్న బలం 17. ఆ పార్టీకి ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఇస్తారని అంటున్నారు. దాంతో కాంగ్రెస్‌కు 18 మంది ఉన్నట్లే. సాధారణ పరిస్థితుల్లో అయితే ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించినట్లే. ఇక, టీడీపీకి ఉన్న బలం 12. ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీకి ఉన్న బలం ఐదు. టీడీపీ, బీజేపీ బలం కలిపితే మొత్తం 17. ఆ పార్టీ మరొక ఎమ్మెల్యేకు వల విసరాల్సి ఉంటుంది. లేదా రెండో ప్రాధాన్య ఓట్ల ప్రకారం తన అభ్యర్థిని గెలిపించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోకుండా అధికార పార్టీకి కాకుండా తమ తమ సొంత పార్టీల అభ్యర్థులకే ఓట్లు వేస్తే పరిస్థితి ఇది. వీరిలో ఒకరిద్దరు జారిపోయి అధికార పార్టీకి అమ్ముడుపోయినా, టీడీపీ, కాంగ్రెస్‌ అసంతృప్త నేతలతో కలిసి టీఆర్‌ఎస్‌ బలం పెరుగుతుంది. ఈ రెండు పార్టీలూ ఎలాగూ ఓడిపోతాయి కనక చివరికి రెండో ప్రాధాన్య ఓట్లతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుస్తారు.

తద్వారా తమ పార్టీ గెలవాలనుకుంటే టీడీపీ, బీజేపీ అభ్యర్థులంతా తమ అభ్యర్థికే ఓటు వేయాలి. ఇదే పనిని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా చేయాలి. ఎవరు అమ్ముడుపోతే ఆ పార్టీకి నష్టం తప్పదు.