Begin typing your search above and press return to search.

మొన్న సెలబ్రిటీ.. నేడు మహిళా పారిశ్రామికవేత్త

By:  Tupaki Desk   |   29 Jun 2015 6:59 AM GMT
మొన్న సెలబ్రిటీ.. నేడు మహిళా పారిశ్రామికవేత్త
X
పూటుగా మద్యం తాగితే ఎవరికి ఎలాంటి నష్టం లేదు. మహా అయితే.. సదరు కుటుంబ సభ్యులకు మాత్రమే ఇబ్బంది. కానీ.. ఇష్టానుసారం మందు తాగేసి.. కారు నడపటమే అసలు ఇబ్బంది. రోజురోజుకీ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో.. మద్యం సేవించి కార్లను నడపొద్దని నెత్తినోరూ కొట్టుకొని చస్తున్నా.. ఎంత మాత్రం పట్టకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనం ఈ మధ్యన ఎక్కువైంది.

సమాజంలో పలుకుబడి.. పేరు ప్రఖ్యాతులున్న వారు.. విద్యావంతులు వ్యవహరిస్తున్న వైఖరి విస్మయాన్ని కలిగిస్తోంది. అతిగా మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడిన వారిలో మహిళల సంఖ్య ఈ మధ్యన పెరుగుతోంది. అంతేకాదు.. ఇలా పట్టుబడిన సందర్భంలో వారు చేస్తున్న హడావుడి అంతాఇంతా కాదు. ఈ మధ్యనే ఒక ప్రముఖ డిజైనర్‌ మద్యం సేవించి కారు నడపటం.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌కి ససేమిరా అనటం.. పోలీసుల మీద విరుచుకుపడటం.. చివరకు ఆమెకు పరీక్షలు జరిపితే.. ఆమె మోతాదుకు మించి మద్యం సేవించినట్లుగా తేలటం తెలిసిందే.

ఈ ఘటన మర్చిపోకముందే.. తాజాగా మరో ఉదంతం బయటకు వచ్చింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 12లోని కళింగ చౌరస్తా వద్ద పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌లో ఒక మహిళా పారిశ్రామికవేత్త అతిగా మద్యం సేవించి.. డ్రైవ్‌ చేస్తూ దొరికిపోయారు.

మద్యం సేవించి ఆడి కారులో వస్తున్న ఆమెను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించటం.. ఆమె వేగంగా తన కారును పోనివ్వటం జరిగింది. దీంతో.. ఛేజ్‌ చేసి మరీ పోలీసులు వాహనాన్ని నిలువరించారు. ఈ సందర్భంగా సదరు యువ పారిశ్రామికవేత్త పోలీసులపై చెలరేగిపోయారు. ఈ మొత్తం విషయాన్ని చిత్రీకరిస్తున్న మీడియా వర్గాలపై చిందులు తొక్కారు. చివరకు ఆమె జరిపిన పరీక్షల్లో మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. మహిళా డిజైనర్‌ ఉదంతం మర్చిపోక ముందే.. మరో యువ పారిశ్రామికవేత్త అతిగా తాగి పోలీసులకు దొరికిపోవటం ఇప్పుడు హాట్‌ న్యూస్‌గా మారింది.