Begin typing your search above and press return to search.

కొత్త రాష్ర్టం ఏడాది ప్ర‌స్థానం.....

By:  Tupaki Desk   |   25 May 2015 5:04 AM GMT
కొత్త రాష్ర్టం ఏడాది ప్ర‌స్థానం.....
X
భారత చిత్రపటంపై 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు అప్పుడే ఏడాది అయింది. ఎన్నో పోరాటాలు, మరెన్నో ఉద్యమాలతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఎలుగెత్తి చాటిచెప్పిన ప్రజలు స్వరాష్ట్ర పాలనలో స్వేచ్ఛా గీతం పాడుకుంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అస్త్రంతో 14 ఏళ్ల పాటు గులాబీ దండును నడిపించిన కేసీఆర్ కే తెలంగాణ ఓట‌ర్లు పట్టం కట్టారు. 2014 జూన్‌ 2న తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు వహించారు. కేసీఆర్‌ పాలనకు ఏడాది పూర్తి చేసుకోనున్న నేప‌థ్యంలో తుపాకి ప్ర‌త్యేక క‌థ‌నం...

ప్రత్యేక రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కేసీఆర్ వినూత్న పంథాలో ముందుకెళ్తున్నారు. ఏడాది పాలనలో ఎన్నో హామీలు, మరెన్నో ప్రకటనలు చేసిన తీరుపై ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నా తనదైన శైలిలో కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. 365 రోజుల్లో ప్రతి అడుగు కీలకమే. గొల్కొండ కోటపై మువ్వన్నెలా జెండాను ఎగురవేశారు కేసీఆర్‌. అదే రోజు తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన... దళితులకు 3 ఎకరాల భూపంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వయంగా తానే పేద దళితులకు పట్టాలిచ్చారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. బతుకమ్మ, బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించింది కేసీఆర్ స‌ర్కారు. 2014 ఆగస్టు 19న తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన "సమగ్ర కుటుంబ సర్వే" ప్రపంచ చరిత్రలోనే నిలిపోయింది. ఒకే ఒక్కరోజు... పది జిల్లాలోనూ సమాచారాన్ని సేకరించారు. శాంతిభద్రతల‌ అంశంపై కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. కొత్త వాహనాల కోసం వందలాది కోట్లను ఖర్చు చేసింది.

ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు జనం ముంగిట చేర్చేందుకు ప్రజాస్వామిక వికేంద్రీకరణే సరైన సాధనంగా "మన ఊరు-మన ప్రణాళిక" కార్యక్రమానికి తుది మెరుగులు దిద్దారు. రుణమాఫీ విషయంలో తొలి విడతగా 4 వేల 250 కోట్లను విడుదల చేసింది. అకాల వర్షాల కారణంగా పంట నష్టోయిన రైతాంగానికి 480 కోట్ల రూపాయల ఇన్‌పుట్‌ సబ్సిడీని ప్రకటించింది. తెలంగాణ మార్కెట్ యార్డులకు వచ్చే రైతన్నల కోసం "సద్దిమూట" కార్యక్రమం చేపట్టారు. 2 రూపాయలకే టిఫిన్‌, 5 రూపాయలకే మధ్యాహ్న భోజనంతో అన్నదాత కడపునింపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తొలి విడతగా 462 మంది అమరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నమోదైన 690 కేసులను ఎత్తివేసింది. పొరుగు రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోలు చేసి పవర్ కట్స్ లేకుండా చర్యలు తీసుకుంది. నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్ జిల్లాల్లో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం వేగంగా అడుగులు వేస్తోంది. ఇక తెలంగాణను హరితవనం చేసేందుకు కేసీఆర్ సంకల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు... దౌర్జన్యాలను అరికట్టేందుకుగాను మహిళా భద్రత కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. ఈ మేరకు నగరంలోని సిటీ బస్సుల్లో స్త్రీ, పురుషుల సీట్లకు మధ్య స్లైడర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈవ్‌ టీజర్ల ఆటకట్టించేందుకుగాను "షీ" టీమ్స్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. షీ-క్యాబ్‌లు, ఆటోలు, టాక్సీలను ప్రోత్సహించేందుకు మహిళా డ్రైవర్లకు 50 శాతం సబ్సిడీపై వాహనాలు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యోగులపై కేసీఆర్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్‌ ఇంక్రిమెంట్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అలాగే హెల్త్ కార్డులను అందజేసింది. బంగారు తెలంగాణ కోసం అమాత్యులకు, అధికారులకు అవగాహన తరగతులు నిర్వహించారు. హైదరాబాద్ బ్రాండ్‌ ఇమేజ్ పెంచేందుకు కేసీఆర్ నడుంబిగించారు. విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన ఆకాశ హర్మ్యాల నిర్మాణం, ఫిల్మ్ సిటీలు, ఎలివెటేడ్ ఎక్సెప్రెస్ వేలు, పూర్తి వైఫే సీటీగా మార్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

వీటి సంగ‌తేంటో...
పది జిల్లాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టాల్సిన కేసీఆర్ కేవలం హైదరాబాద్‌పైనే దృష్టి సారించడం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం అయితే ఉపప్రాంతీయ ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మ‌రోవైపు మొండిగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉస్మానియా భూముల సేక‌ర‌ణ, స‌మ‌గ్ర స‌ర్వే సమాచారంపై ఎలాంటి ప్రకటన చేయక‌పోవ‌డం ఇబ్బందులుగా ప‌రిణ‌మించే అవ‌కాశం ఉంది. ఏడాది కావ‌స్తున్నా.... ఉద్యోగాల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌క‌పోవ‌డం పెద్ద వివాదంగా మారే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఉద్యోగుల‌కు పీఆర్సీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ...అందుకు సంబంధించిన ఆదేశాలు విడుద‌ల చేయ‌లేదు. బీసీలు, జ‌ర్న‌లిస్టుల వ్య‌తిరేక వైఖ‌రి అవ‌లంభిస్తున్నార‌నే అపప్ర‌ద పెరిగిపోతోంది. రాజ‌కీయ ఫిరాయింపుల విమ‌ర్శ‌లు సైతం ముప్పిరిగొంటున్నాయి. వీట‌న్నింటినీ స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు వెళితేనే కేసీఆర్ క‌ల‌లు కంటున్న బంగారు తెలంగాణ సాకారం అవుతుంది.
- గ‌రుడ‌