Begin typing your search above and press return to search.

హరీశ్‌ మార్కు ఎదురు దాడి!

By:  Tupaki Desk   |   24 May 2015 5:30 PM GMT
హరీశ్‌ మార్కు ఎదురు దాడి!
X
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రయోగించిన ఎదురు దాడి, బ్లాక్‌మెయిలింగ్‌ విధానాలనే మంత్రి హరీశ్‌ రావు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రయోగిస్తున్నారు. నాయకులు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి.. వాటిని తెలంగాణకు ముడిపెట్టి.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును, ఆ పార్టీ తెలంగాణ నేతలను బోనులో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, హరీశ్‌ ఎదురు దాడికి, బ్లాక్‌ మెయిలింగ్‌కు ఉద్యమ సమయంలో తాము తలగ్గిన మాట వాస్తవమేనని, ఇప్పుడు దానికి లంగే పరిస్థితి లేదని టీడీపీ నేతలు అంటున్నారు.

నవ్యాంధ్ర ఆవిర్భావ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్‌ చేసిన అన్యాయాన్ని ప్రజలకు మరోసారి వివరిస్తూ.. నవ్యాంధ్ర నిర్మాణానికి మరోసారి సంకల్పం చెప్పుకొంటూ నవ నిర్మాణ దీక్ష చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు దీనికి సంబంధం లేదని, వాళ్లంతా తమ సోదరులని, వారితో కలిసి సాగుతామని కూడా స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధికి పున: సంకల్పం మాత్రమే నవ నిర్మాణ దీక్ష అని పదే పదే ఆయన చెప్పారు కూడా. కానీ, చంద్రబాబు వ్యాఖ్యలను మంత్రి హరీశ్‌ వక్రీకరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు ఏపీలో చేస్తున్న దానిని నిరసన దీక్షగా అభివర్ణించి, టీడీపీది ద్వంద్వ వైఖరి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారని, అక్కడ సంబరాలు ఇక్కడ నిరసనలు ఏమిటని నిలదీస్తున్నారని వివరిస్తున్నారు. తద్వారా టీడీపీని ఇరుకున పెట్టడం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా పరిస్థితిని మార్చుకోవడమే ఆయన ధ్యేయమని చెబుతున్నారు.

వాస్తవానికి, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా హరీశ్‌ ఇటువంటి ఎదురు దాడి, బ్లాక్‌ మెయిలింగ్‌కే పాల్పడ్డారని, అప్పట్లో తాము దానిని అర్థం చేసుకోలేక, తెలంగాణ వాదం ముసుగులో ఆయన ట్రాప్‌లో ఇరుక్కున్నామని, ఇప్పుడు ఆ పప్పులు ఉడకవని వివరిస్తున్నారు. చంద్రబాబును, టీడీపీని ఇరుకున పెట్టేందుకు హరీశ్‌, టీఆర్‌ఎస్‌ వేసే ఎత్తులకు లంగబోమని చెబుతున్నారు. ఇకపై తాము కూడా ఎదురు దాడి చేయాలని భావిస్తున్నారు.