Begin typing your search above and press return to search.

గవర్నర్‌ ఎందుకు స్పందించట్లేదు!?

By:  Tupaki Desk   |   3 July 2015 1:59 PM GMT
గవర్నర్‌ ఎందుకు స్పందించట్లేదు!?
X
తెలంగాణలో గవర్నర్‌ నరసింహన్‌ తీరు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. తలసాని శ్రీనివాస యాదవ్‌ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం.. ఇప్పుడు దాదాపు అన్ని పక్షాలూ వ్యతిరేకిస్తున్నా.. ఈ విషయంలో సాక్షాత్తూ తననే తప్పుపడుతున్నా ఆయన ఏమాత్రం స్పందించకపోవడం తెలంగాణలోని వివిధ పార్టీలతోపాటు న్యాయ నిపుణులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. నేరుగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని తప్పుపడుతున్నా ఆ స్థానంలోని వ్యక్తి స్పందించకపోవడం ఏమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీకి చెందిన తలసాని శ్రీనివాసయాదవ్‌కు సీఎం కేసీఆర్‌ మంత్రి పదవి ఇచ్చారు. ఆ మేరకు ఆయన పేరును ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్‌ భవన్‌కు పంపారు. దాంతో తలసాని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినందున ఆయనతో రాజీనామా చేయించాలని గవర్నర్‌ ప్రభుత్వానికి సూచించారు. ఆయన సూచన మేరకు ప్రమాణ స్వీకారం ఉదయం 9 గంటలకు జరుగుతుందనగా ఎనిమిది గంటలకు తలసానితో ఒక ప్రకటన చేయించారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. వాస్తవానికి, దానిని వెంటనే స్పీకర్‌ ఆమోదిస్తేనే గవర్నర్‌ తలసానితో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజీనామా ఆమోదం పొందకపోతే ఆయన టీడీపీ ఎమ్మెల్యే కిందే లెక్క. అప్పుడు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగానికే కాదు.. నైతికంగానూ తప్పేనని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయినా, తలసానితో నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఆరు నెలలు గడిచినా ఆయన రాజీనామాను స్పీకర్‌ ఆమోదించలేదు. తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తలసాని శ్రీనివాస యాదవ్‌ ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేగా, టీడీపీ తరఫున మంత్రిగానే కొనసాగుతున్నారు.

ఈ విషయంలో టీడీపీతోపాటు కాంగ్రెస్‌ కూడా గవర్నర్‌ను తప్పుబడుతున్నాయి. రాజ్యాంగ రక్షకుడుగా ఉండాల్సిన వ్యక్తి రాజ్యాంగ నిబంధనలను తుంగలోకి తొక్కారని ఆయనను నిందిస్తున్నాయి. నేరుగా ఆయనకే లేఖలు రాస్తున్నాయి. ఈ విషయంలో గత ఆరు నెలలుగా ఆయా పార్టీల నేతలు గవర్నర్‌ను తప్పు పడుతూనే ఉన్నారు. అయినా గవర్నర్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదు. వారి విమర్శలను ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం తాను రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదని రాజ్‌భవన్‌ తరఫున పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం లేదు. దాంతో, గవర్నర్‌ తప్పు చేశారని, దానిని సమర్థించుకునేందుకు అవకాశం లేక ఇప్పుడు మౌన ముద్ర దాల్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. తాన చేసిన తప్పును సరి చేసుకునే అవకాశం ఉన్నా ఆయన ఆ దిశగా ప్రయత్నించడం లేదని నిందిస్తున్నారు.