Begin typing your search above and press return to search.

గెలవాలంటే సెంటిమెంటును ఓడించాలి!

By:  Tupaki Desk   |   29 Jun 2015 12:30 PM GMT
గెలవాలంటే సెంటిమెంటును ఓడించాలి!
X
ఈసారి ఎన్నికల్లో మనమే గెలవాలి.. మరోసారి విఫలం కావడానికి వీల్లేదు.. అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేయాల్సిందే అని పార్టీ నేతలకు తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. ఆయన అలా ఎప్పుడూ పిలుపు ఇస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఇటువంటి పిలుపులు చాలా తరచుగా ఇస్తూ ఉంటారు. కానీ, అందుకు ఏం చేయాలనే విషయంలో మాత్రం ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం ఉండదు.

సార్వత్రిక ఎన్నికల్లో బక్కబోర్లా పడిన తర్వాత నుంచి ఆ పార్టీ దాదాపు అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోయింది. కొన్ని ఎన్నికల్లో అయితే డిపాజిట్లు కూడా కోల్పోయింది. మెదక్‌ ఉప ఎన్నికల్లో ఓటమి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిపాజిట్లు దక్కలేదు.. ఇలా చెప్పుకొంటూపోతే కాంగ్రెస్‌ పరాజయాలకు అంతు ఉండదు. ఇంతకూ తెలంగాణలో మంచి పట్టున్న.. తెలంగాణ ఇచ్చిన ఆ పార్టీ ఎందుకు ఓడిపోతోంది అంటే.. అందుకు సమాధానాలు కూడా అనూహ్యం ఏమీ కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సెంటిమెంటును తోసిరాజని ఆ పార్టీ ముందుకు వెళ్లలేకపోతోంది. కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కోలేకపోతోంది. రెండోది.. ఆ పార్టీ నేతలే కొంతమంది కేసీఆర్‌తో కుమ్మక్కు అవుతున్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పని చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్లు పదవులు దక్కించుకుంటున్నారు. కానీ, పార్టీని ఓటమిపాలు చేస్తున్నారు.

ఇప్పటికీ తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంటు ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వజ్రాయుధం కూడా అదే. అయితే, కేసీఆర్‌ వేరు.. తెలంగాణ వేరు అనే భావాన్ని కాంగ్రెస్‌ ఇప్పటి వరకూ తీసుకు రాలేకపోయింది. తెలంగాణ వాదం, కేసీఆర్‌ వాదం ఒకటేనని వివిధ సందర్భాల్లో ఆ పార్టీ కూడా మద్దతు ఇస్తూ ఉంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆ పార్టీ చేసింది కూడా ఇదే. దాంతో కేసీఆర్‌ బలపడడానికి కాంగ్రెస్‌ పార్టీయే అన్ని అస్త్రాలూ ఇస్తూ ఉంటుంది. కాంగ్రెస్‌ చేసిన శ్రమంతా కేసీఆర్‌కు లాభం చేకూరుస్తూ ఉంటుంది. కేసీఆర్‌ ఏదైనా సెంటిమెంటును తెరపైకి తెచ్చినప్పుడు దానికి మద్దతు పలకడం ద్వారా కేసీఆర్‌ను బలోపేతం చేస్తూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్‌ ఎత్తులకు కాంగ్రెస్‌ నేతలు ప్రతిసారీ చిత్తవుతూనే ఉన్నారు. దీనిని సమర్థంగా ఎదుర్కొని కేసీఆర్‌ వేరు తెలంగాణ వాదం వేరనే భావన తీసుకు రానంత వరకు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అది ఎంపీ ఎన్నిక కావచ్చు.. సర్పంచి ఎన్నిక కావచ్చు.. ఈ భావన తీసుకురానంత వరకు కాంగ్రెస్‌ ఓడిపోతూనే ఉంటుందని.. దిగ్విజయ్‌ కాదు కదా.. సాక్షాత్తూ సోనియా గాంధీ దిగి వచ్చినా ఒరిగేది ఏమీ ఉండదని తేల్చి చెబుతున్నారు.