Begin typing your search above and press return to search.

విమర్శలు చేస్తేనే విధేయుడిగా ఉన్నట్లు లెక్కంట..!

By:  Tupaki Desk   |   5 July 2015 9:54 AM GMT
విమర్శలు చేస్తేనే విధేయుడిగా ఉన్నట్లు లెక్కంట..!
X
తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలే కానీ.. మరో రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ పార్టీకి తిరుగు ఉండదంటూ కాంగ్రెస్‌ అధినాయకత్వానికి ఎవరైతే ధీమా చెప్పి మరీ.. విభజన చేయించారో.. అలాంటి వారంతా పార్టీకి గుడ్‌ బై చెబుతుండటం తెలిసిందే. ఒకరి తర్వాత ఒకరిగా పార్టీని వీడిపోవటమే కాదు.. పార్టీని త్వరలో వీడిపోతారన్న పేర్లు కూడా భారీగా వినిపిస్తున్న పరిస్థితి.

రెండు.. మూడు రోజుల్లో డి. శ్రీనివాస్‌ కారు ఎక్కేందుకు అన్ని ప్రయత్నాలు చేసుకోవటంతో పాటు.. తనతో భారీ పటాలాన్ని తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేసినా.. తాజా పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక.. మరికొద్ది రోజుల్లో పార్టీ నుంచి జంప్‌ అయ్యే వారంటూ మీడియాలో వస్తున్న పేర్లతో.. సదరు నేతలు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు.

ఇలాంటి ప్రచారం నుంచి బయట పడేందుకు వారు కాస్తంత వెరైటీ ప్లాన్‌ వేస్తున్నారు. పార్టీ నుంచి జంప్‌ కావటం ఖాయమంటూ మీడియాలో పేర్లు వచ్చే నేతలు.. తెలంగాణ అధికారపక్షాన్ని తిట్టిపోయటం ద్వారా పార్టీ పట్ల తమకున్న కమిట్‌మెంట్‌ను ప్రదర్శించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి దానం నాగేందర్‌ వ్యవహారమే చూస్తే.. ఇంచుమించు ఇలానే ఉంది.

టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే నేతల్లో కచ్ఛితంగా పార్టీ మారే వారి జాబితాలో దానం నాగేందర్‌ పేరు టాప్‌లో ఉంది. అయితే.. దానం మాత్రం ఇందుకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. తనను బద్నాం చేసేందుకే ఈ కుట్ర సాగుతుందని.. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెబుతున్నారు. అధినాయకత్వానికి తప్పుడు సమాచారం అందిస్తూ.. కావాలని తప్పుదారి పట్టించే పనిలో భాగంగానే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన డి శ్రీనివాస్‌పై విమర్శలు చేశారు.

డీఎస్‌ను విమర్శలు చేయటం ద్వారా.. పార్టీ పట్ల తనకున్న విధేయతను ప్రదర్శించటంతో పాటు తాను పార్టీలోనే కొనసాగుతానన్న సందేశాన్ని ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత కష్టపడే కన్నా.. ఢిల్లీకి వెళ్లి అమ్మను కలుసుకొని రెండు మాటలు చెప్పి.. తన విధేయతనంతా అమ్మ దగ్గర ప్రదర్శిస్తే సరిపోతుంది కదా. దానం ఆ పని ఎందుకు చేయటం లేదు..?