Begin typing your search above and press return to search.

''కారు'' ఎక్కుతున్నది అఫీషియల్‌గా చెప్పేశారు

By:  Tupaki Desk   |   2 July 2015 8:48 AM GMT
కారు ఎక్కుతున్నది అఫీషియల్‌గా చెప్పేశారు
X
అంచనాలకు తగినట్లే తాజా పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన డి శ్రీనివాస్‌.. తాజాగా తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ను విడిచి పెట్టటం బాధగా ఉందన్న ఆయన.. తన రాజీనామాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ తనకు ఎన్నో పదవులు ఇచ్చిందని.. తాను ఎన్నో పనులు చేసినట్లు చెప్పిన డీఎస్‌.. తెలంగాణ అభివృద్ధి కోసం.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని తీర్చటం కోసం తాను టీఆర్‌ఎస్‌ పార్టీలో భాగస్వామ్యం కానున్నట్లు చెప్పారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీనే అన్న విసయం అందరికి తెలుసని.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని తేల్చారు.

తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని చెప్పిన డీఎస్‌.. తెలంగాణను తెచ్చింది మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరేనని పేర్కొన్నారు. పదవుల కోసం తాను పార్టీ మారుతున్నట్లు చెప్పటం సరికాదని.. తనకు ఎమ్మెల్సీ పదవి ఒక లెక్కా అని ఆయన వ్యాఖ్యానించారు. వందల బీఫామ్‌లు ఇచ్చిన తనకు పదవులు పెద్ద విషయం కాదన్నారు.

ఇక.. కాంగ్రెస్‌ అధినాయకత్వం దూత దిగ్విజయ్‌ సింగ్‌పై డీఎస్‌ నిప్పులు చెరిగారు. చెప్పుడు మాటలు విని తనపై వ్యాఖ్యలు చేసి దిగ్విజయ్‌ ఒక లోఫర్‌గా అభివర్ణించారు. తన గురించి దిగ్విజయ్‌ మాట్లాడటానికి ఎంత ధైర్యం అని మండి పడ్డారు.

ముఖ్యమంత్రి పదవి తప్ప మిగిలిన అన్నీ పదవులు తాను చేసినట్లు చెప్పుకున్నారు. కాంగ్రెస్‌లో నిబద్ధతతో పని చేసినట్లుగా చెప్పుకున్న డీఎస్‌.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను చాలా చేసినట్లు చెప్పుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనా దక్షతపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఎమ్మెల్సీ పదవి తనకో లెక్కా అని చెబుతున్న డీఎస్‌.. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన తర్వాత.. పదవులు ఏమీ చేపట్టకుండా తెలంగాణ సమాజం కోసం మాత్రమే పని చేస్తారా? అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు.