Begin typing your search above and press return to search.

నిన్నటి పెద్దమనుషులు.. నేడు చెత్తబుట్టలోకి..!

By:  Tupaki Desk   |   4 July 2015 11:44 AM GMT
నిన్నటి పెద్దమనుషులు.. నేడు చెత్తబుట్టలోకి..!
X
కాలం ఎంత చిత్రమైంది. నిన్న.. నేడుకు మధ్య వ్యత్యాసం ఎంత ఎక్కువ? మిగిలిన వాటి మాదిరే కీర్తి కూడా శాశ్వితం కాదన్న విషయం మరోసారి తేలిపోయింది. నిన్నవరకూ పార్టీకి ఎంత సేవ చేశారు.. స్ఫూర్తిగా తీసుకుంటే ఇలాంటి వారినే తీసుకోండంటూ కీర్తించిన వారి ఫోటోల్ని తాజాగా చెత్తబుట్టలో కసిగా పడేసిన తీరు గాంధీ భవన్‌లో కనిపించి.. అరే.. ఇలాంటి వారినా మనం ఇంతకాలం మా గొప్పగా అనుకుందన్న భావన కలిగేలా చేసింది.

పార్టీకి పెద్ద మనుషులుగా కీర్తిస్తూ.. పార్టీకి వారేం చేశారు? వారికి పార్టీ ఏం చేసిందన్న విషయానికి సంబంధించి లెక్కలేమీ చూసుకోకుండా నేతల్ని నెత్తి మీద కూర్చోబెట్టుకునే కార్యకర్తలు కన్ఫ్యూజ్‌ పడే ఘటనలు గాంధీభవన్‌లో చోటు చేసుకున్నాయి.

కాలానికి తగినట్లుగా తమకు తగ్గ నిర్ణయాలు తీసుకొని పార్టీలో నుంచి నేతలు వెళ్లిపోవటం లాంటివి మామూలే. అప్పుడెప్పడో కేకే అనే కె. కేశవరావు కాంగ్రెస్‌ పార్టీ నుంచి వీడిపోయి కేసీఆర్‌తో కలిసిపోయినా పెద్దగా స్పందించని కాంగ్రెస్‌ నేతలు.. తాజాగా డి శ్రీనివాస్‌ కారు ఎక్కేస్తానంటే మాత్రం అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. అంతేకాదు.. డి శ్రీనివాస్‌ ఫోటల్ని చెత్తబుట్టలే వేసేంత వరకూ నిద్రపోలేదు.

న్యాయం అంటే అందరికి ఒకేలా ఉండాలి. కేకే పార్టీ వీడిపోయి.. టీఆర్‌ఎస్‌తో అత్యున్నత స్థానాన్ని ఎంజాయ్‌ చేస్తున్నప్పుడు పెద్దగా పట్టించుకోని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు.. డీఎస్‌ విషయంలో మాత్రం వెనువెంటనే స్పందించారు. తాజాగా గాంధీభవన్‌కు వచ్చిన రాజ్యసభ సభ్యులు వీహెచ్‌ హనుమంతరావు.. సీనియర్‌ కాంగ్రెస్‌నేత దామోదర్‌రెడ్డిలు.. కేకే.. డీఎస్‌ ఫోటోల్ని తొలగించి చెత్తబుట్టలో వేశారు.

స్వలాభం కోసం పార్టీ బారిన ఇలాంటి వారి ఫోటోలు పార్టీ కార్యాలయంలో ఉండకూడదంటూ మండి పడ్డారు. మరి.. ఈ మంట కేకే పార్టీ మారిన వెంటనే ఎందుకు కలుగలేదో..? ఫోటోలు తీసే విషయంలో నేతల్ని బట్టి లెక్కలు మారుతుంటాయా?